ఎంపీ హరిబాబుకు బంపర్ ఆఫర్? కేంద్ర మంత్రివర్గంలో చోటు?
వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో... ఏపీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించబోతోందనే సంకేతాలు అందుతున్నాయి. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి లభించనున్నట్లు సమాచారం.
అమరావతి: వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో... ఏపీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించబోతోందనే సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం మూడు ఖాళీలు ఉన్నాయి.
ఈ మూడు ఖాళీల్లో.. ఒకటి వెంకయ్యనాయుడిది కాగా, రెండోది మనోహర్ పారికర్ ది. గోవా సీఎంగా పారికర్ వెళ్లడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దేవ్ అకాల మరణం చెందడంతో మూడో స్థానం ఖాళీ అయింది.

కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరాది వారు ఎక్కువగా ఉండటంతో, ఈసారి వారికి స్థానం దక్కకపోవచ్చని విశ్వసనీయ సమాచారం. దక్షిణాదిలో బలపడాలని బీజేపీ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈసారి కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాదివారికే అవకాశం కల్పించవచ్చని చెబుతున్నారు.
ఏపీలో ఒకరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే... ఇక్కడ బలపడవచ్చని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర మంత్రి పదవికి ఏపీ నుంచి విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబే సమర్థుడని పార్టీ అధినాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఏపీ బీజేపీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications