కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న 'మోడీషా' AP రాజకీయం?
2024 ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ తీరు ఎలా ఉండబోతోంది? అనే విషయం ఏపీలో రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రానున్న ఎన్నికలు వైసీపీ, టీడీపీ, జనసేనకు అత్యంత ప్రధానమైనవి. 2019 ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ''రాజకీయం'' అన్ని పార్టీలకు తెలుసు. మరోసారి అలాంటిది పునరావృతం కాదన్న నమ్మకాన్ని ఎవరికీ కలిగించలేకపోతున్నాయి.

ఆర్థిక మూలాలమీద దెబ్బతీయడం..
తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడంవల్ల గత ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయానికి మూల కారణమయ్యాయి. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా ఉంటే చాలు అని చంద్రబాబు కోరుకుంటున్నారు. బీజేపీతో పొత్తు లేకపోయినప్పటికీ ఐటీ, ఈడీ దాడులంటూ ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలని చంద్రబాబు రాయబారం పంపిస్తున్నారు. దీనిపై కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. సహజంగానే మౌనం వహించారు.

సాన్నిహిత్యం తగ్గకుండా ఉంటే చాలు?
కేంద్రం మరోసారి ఇలాంటి చర్యలు తీసుకుంటేనే తనకు గెలుపు దక్కుతుందనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావనగా ఉంది. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటంవల్ల కలిగే లాభాలను వైసీపీ అర్థం చేసుకోగలిగింది. అందుకే మరోసారి ఆ సాన్నిహిత్యం తగ్గకుండా జగన్ చూసుకుంటున్నారు. కేంద్ర పెద్దల ఆలోచనా తీరు ఏమిటో ప్రధాన పార్టీల నేతలకు అర్థం కాకుండా చేస్తోంది. ఒకవైపు విశాఖపట్నం వచ్చి పవన్ కల్యాణ్ ను పిలిపించుకొని ఆయనకు రోడ్ మ్యాప్ ఇస్తారు. అలా అని చంద్రబాబును దగ్గరకు తీయకుండా ఉన్నారా? అంటే జీ-20కి రావాలంటూ ఆహ్వానాలు పంపించారు. ఆయనతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు కనపడుతోంది.

కేంద్ర పెద్దల రాజకీయం అర్థం కాకుండా ఉందే
వైఎస్ షర్మిలతో మోడీ ఫోన్ లో మాట్లాడడం లాంటి పరిణామాలను బట్టి బీజేపీకి అవకాశం దొరికితే తమను కూడా ఇబ్బంది పెట్టడానికే చూస్తారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మోడీని ఎదిరిస్తే చంద్రబాబు ఎదుర్కొన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందస్తు ఉంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు విషయాన్ని లీక్ చేశారు. అందరూ నిజమే అనుకుంటున్నారు. కేంద్రం సఖ్యత చూపిస్తేనే మందస్తు ఎన్నికలు వస్తాయి. వారికి ఇష్టంలేకపోతే ముందస్తు ఎన్నికలు రావు.

ముందస్తు వద్దంటున్నారా?
ఢిల్లీ వెళ్లినప్పుడు జగన్ తో మోడీ ముందస్తు వద్దన్నారని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఎన్నికలతోపాటు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచన చేస్తున్నప్పటికీ కేంద్రం ఇష్టపడాల్సి ఉంటుంది. ముందస్తుకు వెళితే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమనే నమ్మకంతో వైసీపీ శ్రేణులున్నారు. షెడ్యూల్ సమయానికి జరిగితే విపక్షాలు బలపడతాయని అంచనా వేస్తున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి కేసీఆర్ ముందస్తు తెచ్చుకొని 2018 ఎన్నికలను గట్టెక్కగలిగారు. అలాగే తాము కూడా ముందస్తుకు వెళ్లాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ కేంద్ర సహకరిస్తేనే ముందస్తు ఎన్నికలు జరుగుతాయి. లేదంటే జరగవు.












Click it and Unblock the Notifications