నాపై 'అలిపిరి' దాడి జరిగింది ఎందుకంటే?...ఎస్ఐల సమావేశంలో వివరించిన చంద్రబాబు
విజయవాడ:టెక్నాలజీని వినియోగిస్తే పోలీసింగ్ మరింత సులభం అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శిక్షణ పూర్తిచేసుకున్న ఎస్ఐలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టెక్నాలజీని వినియోగం ద్వారా పరిశోధన చేయడమేకాకుండా నేరాలను సైతం విజయవంతంగా అరికట్టవచ్చని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. తప్పు చేస్తే దొరికిపోతామనే భయమనేది ఉంటే అసలు నేరాలే జరగవని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అలిపిరి ఘటనను ఆయన ప్రస్తావిస్తూ ఆ దాడి తనపై ఎందుకు జరిగిందో ట్రైనీ ఎస్ఐలకు వివరించారు.
అలిపిరి దాడి గురించి చంద్రబాబు ఏం చెప్పారంటే..."రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేది...హైదరాబాదులో వీధికో గుండా ఉండేవాడు...నగరాల్లోనూ రౌడీయిజం ఉండేది...అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక వీటిని అరికట్టాం...అందుకే నాపై అలిపిరి దాడి జరిగింది"...అని చంద్రబాబు వివరించారు. అయితే పోలీసులు ఒక విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలని...పోలీసులు చెడు చేసినా, మంచి చేసినా ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని చంద్రబాబు అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ కానిస్టేబుల్ ఏ చిన్న తప్పు చేసినా దాన్ని కూడా సీఎంకే ఆపాదించేస్తున్నారని చంద్రబాబు అన్నారు. నేర నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20వేల సీసీ కెమెరాలు పెట్టబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో నేరాలను కనిష్ట సంఖ్యకు చేర్చేందుకు రాబోయో కాలంలో మరిన్ని సంస్కరణలు తేనున్నట్లు చంద్రబాబు తెలిపారు.