కళ్లు నెత్తికెక్కాయి, సిగ్గుపడాలా: చంద్రబాబుపై జగన్ నిప్పులు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాటలు వింటుంటే ఆయనకు కళ్లు నెత్కికెక్కినట్లు అనిపిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. తనకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలనే చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 53వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు
మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, నాలుగేళ్ల పాటు పింఛన్లు ఇవ్వకుండా అన్యాయం చేసిన ఈ వ్యక్తికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందని, పింఛన్లు ఇవ్వడం లేదన్న విషయం ఇప్పుడే తెలిసిందని డ్రామాలు ఆడుతున్నారని జగన్ అన్నారు.
ఒక్క హామీ కూడా అమలు చేయలేదు...
నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని అమలు చేయని వ్యక్తి తనకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చెప్పడం దుర్మార్గమని వైయస్ జగన్ అన్నారు. చిత్తూరు జిల్లాకు చంద్రగ్రహణం పట్టుకుని, అభివృద్ధి ఆగిపోయిందని వ్యాఖ్యానించాు నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని, ఏమీ చేయకుండానే నాకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు అంటున్నారని, ఆయన మాటలు చూస్తే కళ్లు నెత్తికెక్కినట్లున్నాయని జగన్ అన్నారు.
ఓటు వేయకుంటే సిగ్గుపడాలా..
"ఓటు వేయకుంటే ప్రజలు సిగ్గుపడాలా?. ఏమీ చేయకుండా ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సిగ్గుపడాలా?. ఏం చేశాడని చంద్రబాబుకు ఓట్లు వేయాలి. మూడుసార్ల కరెంట్, బస్సు ఛార్జీలను పెంచిన ఘనత చంద్రబాబుది. అలాంటి చంద్రబాబుకు ఓట్లు వేయాలా? రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, నిరుద్యోగ భృతి ఇస్తామని, మాట తప్పినందుకు ఓట్లు వేయాలా?. ఎన్నికల సమయంలో పదేళ్లు కాదు...పదిహేనేళ్లు హోదా కావాలన్నారు. ఎన్నికలు రాగానే హోదాను మర్చిపోయారు" అని జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి..
"ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి హోదాను అమ్మేసినందుకు ఓట్లు వేయాలా?. జన్మభూమి కమిటీల పేరుతో మఫియాను ప్రోత్సహిస్తున్నారు. 35 పడకల ఆస్పత్రికి ఎమ్మల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 11 ఎకరాల సొంత భూమి ఇచ్చారు. ఆ స్థలంలో ఆస్పత్రిని కట్టడం లేదు. ఆ భూమిని తిరిగి ఇవ్వడం లేదు. ఆ భూమి ఇస్తే ఆస్పత్రి కట్టడానికి మేం సిద్ధం. పుంగనూరులో ఆర్టీసీ డిపో కట్టి ఏడున్నరేళ్లు అయినా బస్సులు ఇవ్వలేదు. ఇంత అన్యాయమైన పాలన ఎక్కడా ఉండదు. పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ఆర్టీసీని బ్రహ్మాండంగా నడిపిస్తాం" అని జగన్ అన్నారు.
మేం ఇవన్నీ చేస్తాం...
హంద్రీ-నీవా నీటిని పుంగనూరుకు తీసుకొచ్చి అన్ని చెరువులను నింపి గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తామని ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తామని చెప్పారు. రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీలో చేరుస్తామని, ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి విశ్రాంతి అవసరం అయితే ఆరు నెలల పాటు డబ్బులిస్తామని ఆయన అన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన చెప్పారు.