బాబూ! 600 కోట్లు ఎక్కడివి, నా పార్టీ వాళ్లకూ నేను వ్యతిరేకమే: జగన్ ట్విస్ట్
అనంతపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి అధినేత జగన్ శుక్రవారం నాడు నిప్పులు చెరిగారు. నిండా అవినీతిలో మునిగిన చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష అని చెప్పడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలో ఆయన రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది.
ఈ సందర్భంగా మాట్లాడారు. దీక్ష పైన పత్రికలలో వచ్చిన ప్రకటనల చదివితే, చంద్రబాబు ప్రజలను ఎంత ఘోరంగా అవహేళన చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. అవినీతిరహిత రాష్ట్రం కోసం అంతా పాటుపడాలని ఆయన చెప్పడం విడ్డూరమన్నారు.
తెలంగాణలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడన్నారు. తమ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 నుంచి రూ.40 కోట్ల రూపాయలిచ్చి చంద్రబాబు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.600 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.
ఇసుక నుంచి బొగ్గు కొనుగోలు వరకు అంతటిలోనూ అవినీతే జరుగుతోందన్నారు. ఏపీ కోసం ప్రధాని మోడీని నిలదీసే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. తన అవినీతిపై ప్రధాని మోడీ విచారణ జరిపిస్తారనే భయం చంద్రబాబులో ఉందన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మంత్రులను వైదొలగమంటామని మోడీకి ఎందుకు అల్టిమేటం ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను ఇప్పుడు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు తన ఆత్మసాక్షిని ఓసారి ప్రశ్నించుకోవాలన్నారు.
చంద్రబాబు గత రెండేళ్లలో చేయని మోసం అంటూ ఏదీ లేదన్నారు. రుణమాఫీ, ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి.. ఇలా అన్నింటా మోసం చేశారన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం, గౌరవం లేదన్నారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు.
బాబు మీద వ్యాఖ్యలను సమర్థించుకున్నారు
చంద్రబాబు పైన తాను చేసిన వ్యాఖ్యలను జగన్ సమర్థించుకున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే చెప్పుతో కొట్టాలని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. ప్రజలు చెప్పులు చూపిస్తే, అప్పుడైన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆయన అన్నారు. యాడికి కాల్వను వైయస్ హయాంలో నిర్మిస్తే ఒక్క ఎకరాకు నీరివ్వలేదన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులపై...
తెలంగాణలో వైసిపి నేతలకు కాంట్రాక్టులు దక్కుతున్నాయన్న ఆరోపణలపై జగన్ స్పందిస్తూ... సీపీఐతో పాటు అన్ని పార్టీలలో కాంట్రాక్టర్లు ఉన్నారని, వారే వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేస్తుంటారని, నేను ప్రాజెక్టులు కట్టొద్దన్నానంటే, వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే కదా అని ట్విస్ట్ ఇచ్చారు.
ప్రాజెక్టులు నిర్మించకుంటే కాంట్రాక్టర్లకు నా వల్ల మేలు కాకుండా నష్టమే జరుగుతోందని జగన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. పది మందికి మేలు జరగడమే తన ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఒకరికి నష్టం వస్తుందని వెనుకడుగు వేయకూడదని చెప్పారు.
కాగా, జగన్ పర్యటనను అడ్డుకునేందుకు టిడిపి కార్యకర్తలు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబును చెప్పుతో కొట్టాలన్నందుకు టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో యాడికిలో జగన్ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. టిడిపి నిరసనలకు ఏమాత్రం వెనుకంజ వేయని జగన్ ముందుకు కదిలారు.
కాగా, అంతకుముందు ఉదయం జగన్ను అడ్డుకునేందుకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ అనుచర గణంతో ర్యాలీగా వచ్చారు. మొత్తం 50 వాహనాల నిండా కార్యకర్తలతో తాడిపత్రి నుంచి బయలుదేరారన్న సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఓ వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు, మరోవైపు వైసిపి శ్రేణులు ఉన్న నేపథ్యంలో యాడికిలో కొంతసేపు ఉద్రిక్తత కనిపించింది. పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి సమీపంలోని చుక్కలూరు వద్దే అడ్డగించారు. ఇక పరిస్థితి చేయి దాటిపోకముందే పోలీసులు యాడికిలో 144 సెక్షన్ ఆంక్షలను అమల్లోకి తెచ్చారు.