జగన్ దోషి కాదు: పురంధేశ్వరి సంచలనం, మోడీ ఎఫెక్ట్.. ఆత్మరక్షణలో బాబు!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం బీజేపీ - తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం బీజేపీ - తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. తాజాగా, బీజేపీ మహిళా నేత పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చదవండి: మనం సమర్థిస్తున్నామా: మోడీకి పురంధేశ్వరి ఘాటు లేఖ, జగన్కు ఊరట
జగన్ పైన వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని, కాబట్టి ఆయనను దోషిగా భావించలేమని టిడిపికి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలకు గుర్తింపు లేకున్నా తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశారు.
జగన్ కలిస్తే తప్పేంటి
ఆమె ఆదివారం మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎవరు, ఎప్పుడైనా కలువవచ్చునని చెప్పారు. ఓ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కలిస్తే తప్పేమిటని నిలదీశారు. మోడీతో జగన్ కలయికను తప్పుబట్టే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పురంధేశ్వరి అన్నారు.
టిడిపి మాటల దాడి.. బీజేపీ ఎదురుదాడితో ఆత్మరక్షణ
ప్రధాని మోడీని ఏపీ ప్రతిపక్ష నేత కలవడాన్ని టిడిపి నేతలు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. 11 ఛార్జీషీట్లలో ఏ 1 నిందితుడిగా ఉన్న జగన్కు మోడీ అపాయింటుమెంట్ ఎలా ఇచ్చారని, క్రిమినల్ను పక్కన కూర్చోబెట్టుకోవడంపై బీజేపీ ఆలోచన చేయాలని టిడిపి నేతలు వరుసగా మాటల దాడి చేశారు.
దీనిపై బీజేపీ నేతలు కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నారు. అసలు ప్రధానిని ఓ ప్రతిపక్ష నేత కలిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్ పైన కేసులు ఇంకా రుజువు కాలేదని తేల్చి చెబుతున్నారు. బీజేపీ ఎదురు దాడితో ఇప్పుడు టిడిపి ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది.
మోడీతో జగన్ భేటీని తప్పుబట్టడం లేదు.. కాల్వ
మోడీతో జగన్ భేటీ ప్రజా సంక్షేమం కోసమే అయితే అంత రహస్యం ఎందుకమని మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రధానితో చర్చించిన అంశాలను వైసిపి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసమే అయితే దానిని ప్రధాన అంశంగా ఎందుకు పెట్టలేదన్నారు. గతంలో బీజేపీని మతతత్వ పార్టీ అని జగన్ అన్నారని విమర్శించారు. అదే సమయంలో.. మోడీతో జగన్ భేటీని టిడిపి తప్పుబట్టడం లేదన్నారు. తద్వారా.. బీజేపీ ఎదురు దాడి నేపథ్యంలో టిడిపి నేతలు ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది.
తగ్గుతున్న టిడిపి
మోడీ - జగన్ భేటీపై టిడిపి నేతలు వరుసగా మాటల దాడి చేస్తుండటంతో.. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న బీజేపీ నేత మాణిక్యాల రావు కూడా ఘాటుగా స్పందించారు. బీజేపీపై టిడిపి నేతలు కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ఆదివారం అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. మాణిక్యాల రావు వ్యాఖ్యలు బాధించాయన్నారు. కానీ ఓ క్రిమినల్ను పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని బీజేపీ ఆలోచించాలన్నారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ... ప్రధానిని ఎవరైనా కలువవచ్చునని చెప్పారు. కానీ క్రిమినల్స్ను కూర్చోపెట్టుకోవడం సరికాదన్నారు.
జగన్ క్రిమినల్ అంశంపై బీజేపీ, వైసిపి సమాధానం
ప్రధానిని ఎవరైనా కలువవచ్చునని, కానీ క్రిమినల్స్తో కూర్చోవడం సరికాదన్న టిడిపి నేతలకు వైసిపితో పాటు బీజేపీ నేతలు కూడా సమాధానం చెబుతున్నారు. జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడే తప్ప నేరస్తుడు కాదని వైసిపి చెబుతోంది. జగన్పై కుట్ర ప్రకారం కేసులు వేశారని వైసిపి ఆరోపిస్తోంది. బీజేపీ కుట్ర అని చెప్పనప్పటికీ... జగన్ పైన నేరారోపణలు రుజువు కాలేదని కాబట్టి క్రిమినల్ కాడని చెబుతోంది.