పొలిటికల్ కౌంటర్: కోస్తాలో పట్టుకు జగన్ వ్యూహం, సీమలో బాబు ప్లాన్ ఇదే, 2019 ఎవరిదో?
కోస్తా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపి అధినేత జగన్ ప్రయత్నాలను ప్రారంభించారు.ఈ మేరకు కోస్తా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే వ్యూహాంపై ఆయన పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు.
అమరావతి: కోస్తా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపి అధినేత జగన్ ప్రయత్నాలను ప్రారంభించారు.ఈ మేరకు కోస్తా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే వ్యూహాంపై ఆయన పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు రాయలసీమలో పట్టును పెంచుకొనేందుకు టిడిపి ప్రయత్నాలను సాగిస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా అడుగులువేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అన్ని పార్టీల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అయితే వైసీపి అధినేత జగన్ కూడ అమరావతిలోనే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించాలనే యోచన చేస్తున్నారు.
అయితే హైద్రాబాద్ నుండే వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యకలాపాలను నిర్వహించారు.అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండే అధికార టిడిపి సహ, ఇతర పార్టీలన్నీ కార్యకలాపాలను ప్రారంభించిన నేపథ్యంలో వైసీపీ కూడ అమరావతి నుండే కార్యకలాపాలను ప్రారంభించనుంది.
అమరావతి నుండి కార్యకలాపాలను ప్రారంభించడం వల్ల కోస్తా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అవకాశాలుంటాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. రాయలసీమలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ కోస్తా జిల్లాల్లో ఆ పార్టీకి అనుకొన్నంతగా పట్టులేదు.దీంతో రాజధాని నుండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా పార్టీకి ప్రయోజనం కల్గించే అవకాశం లేకపోలేదు.
కోస్తా జిల్లాల్లో పట్టుకు వైసీపీ ప్లాన్
కోస్తా జిల్లాల్లో పట్టును పెంచుకొనేందుకుగాను వైసీపీ వ్యూహన్ని రచిస్తోంది. కోస్తా జిల్లాల్లో టిడిపికి ఉన్న పట్టును తగ్గించేందుకు వైసీపీ ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని భావిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలను కేంద్రంగా చేసుకొని ఇటీవల కాలంలో వైసీపీ అధినేత జగన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా వైసీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్.
అసెంబ్లీ సమావేశాల నుండి ప్లాన్ మార్చిన వైసీపీ
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నుండి వైసీపీ కూడ తన వ్యూహాన్ని మార్చుకొంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి.ఈ సమావేశాలకు హజరైన ఎమ్మెల్యేలకు వైసీపీ హోటళ్ళలో వసతిని కల్పించింది.అయితే ఈ సమావేశాల నుండే అమరావతి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని ఆ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతి సమీపంలోని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.
వైసీపీ వ్యూహమిదే
కృష్ణా, గుంటూరు సరిహద్దుల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని టిడిపి ప్రభుత్వం తొలుత భావించింది.అయితే ఆనాడు వైసీపీ నేతలు ప్రకాశం జిల్లాలో లేదా రాయలసీమ ప్రాంతంలో రాజధానిని నిర్మించాలనే వాదనను తెచ్చారు.ఈ సమయంలో అమరావతిలో రాజధానిని ప్రభుత్వం ఖరారు చేసింది.అయితే ఈ సమయంలో వైసీపీపై కోస్తాలో వ్యతిరేకత వచ్చింది. రాజధానికి వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారనే వాదనను అధికార టిడిపి ముందుకు తెచ్చింది. ఈ తరుణంలో వైసీపీ కార్యకలాపాలను అమరావతి నుండి నిర్వహించడం ద్వారా పార్టీపై ఉన్న వ్యతిరేకతను కొంతనైనా తగ్గించుకొనే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
రాయలసీమపై టిడిపి దృష్టి
రాయలసీమలో టిడిపి బలహీనంగా ఉంది. అనంతపురం జిల్లాలో మినహాయిస్తే చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లో ఆ పార్టీకి ఆశించినంత పట్టులేదు.అయితే వైసీపీని దెబ్బతీసేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. వైసీపీలో కీలకంగా ఉన్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు వైసీపీలోని కీలకనాయకులు టిడిపిలో చేరారు.కోస్తాలో టిడిపికి ఇబ్బందులు లేనప్పటికీ వైసీపీని రాయలసీమలో దెబ్బకొడితే తమకు ఎదురు ఉండదని టిడిపి ప్లాన్ .అయితే ఈ దిశగా టిడిపి నాయకత్వం పావులు కదుపుతోంది. అయితే టిడిపిలోని అసంతృప్తులను చేరదీసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు చోటుచేసుకొన్న పరిణామాల్లో వైసీపీపై సీమ ప్రాంతంలో టిడిపి కొంత పైచేయిగా కన్పిస్తోంది. పార్టీ ఫిరాయింపుల ద్వారా వైసీపీ శ్రేణుల్లో మనోధైర్యం దెబ్బతీసేందుకు టిడిపి చేసిన ప్లాన్ కొంతమేరకు ఫలించదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.