ఎవరా డైరెక్టర్?: వైసీపీ నుంచి టికెట్ పక్కా?, లెక్కలు చక్కబెట్టేస్తున్నారట..
కాకినాడ: వచ్చే 2019ఎన్నికల కోసం ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టింది ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ. తూర్పు గోదావరి జిల్లాలో దీనికి సంబంధించిన కసరత్తులన్ని ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చేశాయి. ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎవరిని బుజ్జగించాలి వంటి లెక్కలన్ని పక్కాగా సిద్దం చేసుకున్నారట. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరేసి కోఆర్డినేటర్లు ఉండటంతో.. ఎన్నికల నాటికి ఎలాంటి పేచీలు లేకుండా ఉండేందుకే వైసీపీ ఇప్పటినుంచే దానిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
జిల్లాలో ఎవరెవరికి టికెట్లు దక్కనున్నాయో... వారికి ఇప్పటికీ పార్టీ నుంచి సంకేతాలు అందినట్టు చెబుతున్నారు. ఈ మేరకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వారితో సూచనప్రాయంగా చెప్పినట్టు తెలుస్తోంది. కాకినాడ టౌన్,ముమ్మిడివరం, రాజోలు, మండపేట, రామచంద్రపురం అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల పూర్తయినట్టు సమాచారం.
రామచంద్రపురం నుంచి మాజీ ప్రతినిధి అయిన ఓ బీసీ నేతకు టికెట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కాకినాడ అర్బన్ స్థానాన్ని ఓ మాజీ ఎమ్మెల్యేకి ఇవ్వనున్నారట. ఇక ముమ్మిడివరం స్థానాన్ని మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధికి అవకాశం ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజోలు టికెట్ పై కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసినట్టు చర్చ జరుగుతోంది.
ఎవరా డైరెక్టర్?:
ఇక రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం విషయంలో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ స్థానాన్ని ఓ ప్రముఖ సినీ దర్శకుడికి కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. సదరు దర్శకుడి సామాజికవర్గం కూడా ఇక్కడ కలిసివస్తుందని భావిస్తున్నారట. అయితే రెండేళ్ల క్రితం టికెట్ కోసం వైసీపీ చుట్టూ తిరిగిన ఆయన నుంచి ఇప్పటిదాకా మళ్లీ కబురు రాలేదట. వైసీపీ మాత్రం ఆయనకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించిందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే అమలాపురం లోక్సభ నుంచి రిటైర్డ్ ఇన్కమ్ట్యాక్స్ అధికారిని ఒకరిని బరిలోకి దించనున్నారని తెలుస్తోంది.
మండపేట ఎవరికి?:
ఇక మండపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమిపాలైన గిరజాల వెంకటస్వామి ఇప్పటికే పార్టీని వీడారు. టికెట్ దక్కుతుందని అనుకుంటున్న కీలక నేత కూడా వైసీపీ నుంచి జంప్ అవుతారని అంటున్నారు. దీంతో ఇక్కడి నుంచి ఓ కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ వారంలో దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు.