చర్చిలకు నందిగంసురేష్ ఎంపీ లాడ్స్ నిధులా ? వివరణ కోరిన కేంద్రం-రఘురామ ఫిర్యాదుపై
ఏపీలో ఎంపీ లాడ్స్ దుర్వినియోగం వ్యవహారంపై కేంద్రం మరోసారి స్పందించింది. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తన ఎంపీ లాడ్స్ నిధుల్లో 40 లక్షలు చర్చిల నిర్మాణం కోసం కేటాయించడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. గతంలోనే ఓసారి ఏపీ ప్రభుత్వం వివరణ కోరింది. కానీ ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరోసారి వివరణ కోరుతూ లేఖ పంపింది.

ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగం
ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం ఎంపీ లాడ్స్ పేరుతో ప్రతీ ఎంపీకి నిధులు ఇస్తుంటుంది. ప్రతీ ఏటా ఇచ్చే ఈ నిధులను ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేసి వాటిపై కేంద్రానికి తిరిగి నివేదికలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో నిధులు దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు కూడా పెరుగుతున్నాయి. ఇదే కోవలో ఏపీలోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఇలా తనకు అందిన ఎంపీ లాడ్స్ నిధుల్ని ఓ చర్చి కోసం ఖర్చుపెట్టడం కలకలం రేపింది.

నందిగం సురేష్ పై రఘురామ ఫిర్యాదు
బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో రూ.40 లక్షలు స్ధానికంగా చర్చి నిర్మాణానికి ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రెండు నెలల క్రితం ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఆయన ఈ ఫిర్యాదు చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని వైసీపీ ఎంపీ దుర్వినియోగం చేయడం, అదీ మతపరమైన నిర్మాణానికి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. రాష్ట్రంలో మతమార్పిడులకు సైతం ఈ నిధులు వినియోగిస్తున్నిట్లు తెలిపారు. ఇలాంటి చర్యల్ని అఢ్డుకోకపోతే భవిష్యత్తులో ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపులో ఇబ్బందులు తప్పవన్నారు. దీనిపై కేంద్ర గణాంకాల శాఖ స్పందించింది.

స్పందించని ఏపీ సర్కార్
వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తనకు ఇచ్చిన ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని దుర్వినియోగం చేసి చర్చి నిర్మాణానికి ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని గతంలో కేంద్రం ఆదేశించింది. అయితే కేంద్రం ఆదేశాన్ని వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. రెండు నెలల క్రితమే కేంద్రం లేఖ పంపినా ఏపీ సర్కార్ స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారం మరింత కలకలం రేపింది. ఎంపీ ల్యాడ్స్ దుర్వినియోగంపై కేంద్రం ప్రశ్నించినా సొంత పార్టీ ఎంపీ వ్యవహారం కావడంతో వైసీపీ సర్కార్ మౌనంగా ఉండిపోయింది.

మళ్లీ వివరణ కోరిన కేంద్రం
ఎంపీ నందిగం సురేష్ ఎంపీ ల్యాడ్స్ నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఏపీ సర్కార్ స్పందించకపోవడంపై కేంద్రం మరోసారి రియాక్ట్ అయింది. ఇప్పటికే ఓసారి నివేదిక పంపినా పట్టించుకోకపోవడంపై సీరియస్ అయింది. ఇప్పటికైనా దీనిపై విచారణ జరిపి సాధ్యమైనంత త్వరగా నివేదిక పంపాలని కోరింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, ప్రణాళికా మంత్విత్వశాఖ డైరెక్టర్ రమ్య నుంచి ఏపీ సీఎస్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖలు వచ్చాయి. వీటిపై ఈసారైనా ఏపీ సర్కార్ స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications