ప్రైవేట్ స్కూళ్ల బాదుడు.. సర్కార్ జీవో బేఖాతరు... హెచ్ఆర్సీకి నటుడు శివ బాలాజీ ఫిర్యాదు
టాలీవుడ్ నటుడు శివ బాలాజీ ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై మానవ హక్కుల కమిషన్(HRC)కు ఫిర్యాదు చేశారు. స్కూల్ ఫీజులు తగ్గించాలని కోరినందుకు తమ పిల్లలను ఆన్లైన్ క్లాసుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం తమ పిల్లలను ఆన్లైన్ క్లాసుల నుంచి తొలగించిందన్నారు.
వివరాల్లోకి వెళ్తే... నటుడు శివ బాలాజీ పిల్లలు హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ స్కూల్లో చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ఇటీవల శివ బాలాజీ స్కూల్ యాజమాన్యంతో ఫీజుల గురించి మాట్లాడారు. ఫీజులు తగ్గించాలని కోరారు. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం శివ బాలాజీ పిల్లలను ఆన్లైన్ క్లాసుల నుంచి తొలగించింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ పిల్లలను ఆన్లైన్ క్లాసుల నుంచి తొలగించడం శివ బాలాజీకి ఆగ్రహం తెప్పించింది.
ఈ నేపథ్యంలో శివ బాలాజీ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఫీజుల గురించి మాట్లాడినందుకు తమ పిల్లలను ఆన్లైన్ క్లాసుల నుంచి తొలగించారని ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించమని కోరినందుకే... చెప్పా పెట్టకుండా తమవాళ్లను ఆన్లైన్ క్లాసుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. చాలామంది తల్లిదండ్రులను ఇలాగే ఇబ్బందులకు గురిచేస్తున్న ఆ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అటు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ ఫీజుల పెంపుపై హైదరాబాద్లో నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన 46జీవోను ఉల్లంఘించేలా స్కూల్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వ జీవో చెబుతుంటే... ప్రైవేట్ స్కూళ్లు మాత్రం ఫీజులు పెంచి వేధిస్తున్నాయని ఆరోపించారు.
Hyderabad School Parents' Association stages a protest against private schools for allegedly exacting school fees on various pretexts.
— ANI (@ANI) September 14, 2020
"They're violating Government Order 46 which expressly denies charging any other fees than the nominal tuition fees," says a parent #Hyderabad pic.twitter.com/2ueEe9jyfH