జాతీయ పార్టీ దిశగా ఆప్ మరో అడుగు-కాంగ్రెస్ విపక్ష స్ధానానికీ ఎసరు-కీలక సమీకరణాలివే
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో గెలుపుతో ఊపుమీదున్న బీజేపీని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఒక్క దెబ్బతో ఊడ్చేసిన ఆమ్ ఆద్మీపార్టీ పనిలో పనిగా జాతీయ పార్టీగా మారేందుకు తనకు ఉన్న అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకుంది. ఈ క్రమంలో జాతీయ స్దాయిలో ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్ధానానికీ ఎసరు పెట్టేందుకు ఆప్ సిద్ధమవుతోంది. దీంతో ఈ సమీకరణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
పంజాబ్ ను ఊడ్చేసిన ఆప్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఎగ్జిట్ పోల్ సంస్ధ కానీ, రాజకీయ విశ్లేషకుడూ కానీ ఊహించని రీతిలో 117 సీట్లకు గానూ 92 సీట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు యూపీలో బీజేపీ సాధించిన విజయాన్ని మించిన విజయం సాధించిందనే ప్రశంశలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే యూపీలో బీజేపీ విజయానికి ప్రధాని మోడీ, కేంద్రం, అధికార గణం, యోగీ రూపంలో సిట్టింగ్ ప్రభుత్వం వంటి వంద కారణాలు ఉన్నాయి. కానీ పంజాబ్ లో ఆప్ విజయానికి మాత్రం కేజ్రివాల్ అనే ఢిల్లీ సీఎం.. భగవంత్ మాన్ అనే సిట్టింగ్ ఎంపీపై పెట్టుకున్న నమ్మకం మాత్రమే ఉంది. దీంతో ఇప్పుడు ఆప్ సాధించిన విజయం ప్రత్యర్ధులకు నిద్రలేకుండా చేస్తోంది.
జాతీయ పార్టీగా ఆప్
ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు పంజాబ్ లో సాధించిన ఘన విజయంతో రెండో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయింది. తద్వారా జాతీయ పార్టీగా మారేందుకు తనకున్న అవకాశాల్ని మరింత మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం దేశంలో కేవలం రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఆప్ కూడా రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతోంది. తద్వారా దేశంలో బీజేపీ తర్వాత కనీసం రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండో పార్టీగా ఆప్ మారబోతోంది. అంతే కాదు ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం కూడా జాతీయ పార్టీగా మారేందుకు ఆప్ కు అవకాశాలు మెరుగుపడనున్నాయి.
జాతీయ పార్టీ కావాలంటే ?
మన దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలంటే కనీసం మూడు రాష్ట్రాల్లో కనీసం 2 శాతం లోక్ సభ సీట్లు సాధించాల్సి ఉంటుంది. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ కానీ సార్వత్రిక ఎన్నికల్లో గానీ కనీసం 6 శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నాలుగు లోక్ సభ సీట్లు కూడా ఉండాలి. లేదా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు తెచ్చుకుని ఉండాలి. ఈ నిబంధనలను అధిగమిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తుంది.
జాతీయ పార్టీకి ఆప్ ఎంత దూరం ?
కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిబంధనల్లో రెండో నిబంధన ప్రకారం ఆప్ నాలుగింట మూడు రాష్ట్రాల్లో ( ఢిల్లీ, పంజాబ్, గోవా ) 6 శాతం ఓట్లు సాధించింది. అలాగే ఈ మూడు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ గుర్తింపు కూడా కలిగి ఉంది. నాలుగు లోక్ సభ సీట్లు కూడా ఉన్నాయి. ఆప్ ఖాతాలో ఇప్పటివరకూ 156 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మరో రాష్ట్రం ఈ జాబితాలోకి చేరితే ఆప్ కు జాతీయ పార్టీ గుర్తింపు దక్కడం ఖాయమే. ఇందుకోసం కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ పంజాబ్ గెలుపు తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ సభ్యత్వం పెంచుకోవడంతో పాటు ప్రతీ ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది.