ఏటిఎంలో స్త్రీపై దాడి: కరుడు గట్టిన నేరస్థుడి పనే
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ ఏటిఎం కేంద్రంలో మంగళవారం దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో నెమ్మదిగా కోలుకుంటోంది. కొంత విషమంగా ఉన్నప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితురాలు తలకు తీవ్రమైన గాయం తగిలిందని వైద్యులు తెలిపారు. కాగా నిందితునికి ఇదే మొదటి నేరం కాకపోవచ్చని, అతడు ఇంతకుముందు చాలా నేరాలకు పాల్పడి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బెంగళూరులోని బిజిఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో బాధితురాలు జ్యోతి ఉదయ్(44) చికిత్స పొందుతోంది. ఆస్పత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. దుండగుడి దాడిలో జ్యోతి ఉదయ్ తల భాగానికి తీవ్ర గాయమైందని, సిటి స్కాన్ చేసినప్పుడు ఆమె తలలోని కొన్ని ఎముకలు విరిగినట్లు తెలిసిందని తెలిపారు. బాధితురాలికి కుడివైపు భాగం మొత్తానికి పెరాలసిస్ వచ్చిందని, మెదడుకు గాయం కావడంతో ఆమె తీవ్రంగా బాధపడుతోందని ఆయన చెప్పారు.
సుదీర్ఘమైన శస్త్ర చికిత్స అనంతరం బాధితురాలు మాట్లాడే అవకాశం ఉందని, మెదడులోకి పుర్రెలోని చిన్న ఎముక ఒకటి చొచ్చుకుని పోయిందని దీంతో ఆమె తీవ్రంగా బాధపడుతోందని డాక్టర్ వెంకటరమణ తెలిపారు. శస్త్ర చికిత్స చేసి ఆ ఎముకను సరి చేశామని, ప్రస్తుతం ఆమె ఐసియూలో చికిత్స పొందుతోందని వైద్యులు చెప్పారు. కాగా బాధితురాలు కార్పొరేషన్ బ్యాంకు మిషన్ రోడ్ బ్రాంచిలో మేనేజర్గా విధులు నిర్వహిస్తోందని, ఆమెపై దాడికి పాల్పడిన నిందితుడికి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.
జ్యోతి ఉదయ్పై కత్తితో దాడి చేసిన దుండగుడు ఆమె వద్ద ఉన్న రూ. 2,500లను, ఆమె మొబైల్ ఫోన్ను అపహరించుకుపోయాడని పోలీసులు తెలిపారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఏటిఎం గదిలోనే ఉంచి షటర్ మూసివేసి దుండగుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఏటిఎం నుంచి రక్తం బయటికి రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర అరుద్కర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండుగుడికి ఇదే తొలి నేరం కాదని, ఇదివరకు చాలా నేరాలకు పాల్పడి ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
డిప్యూటీ కమిషనర్ డిసి రాజప్ప మాట్లాడుతూ... నిందితునిపై ఐపిసి 397 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితున్ని గాలించేందుకు 8 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. ఏటిఎం ఫుటేజిని పరిశీలించామని, డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చిన జ్యోతి ఉదయ్పై ఏటిఎం షెటర్ మూసివేసి దుండగుడు దాడికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. నిందితుడు దాడికి పాల్పడిన సమయంలో ఎలాంటి మాస్కు ధరించలేదని, త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని ఆయన తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దాడికి సంబంధించి ఓ అనుమానితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.