బెంగళూరు కాంగ్రెస్ లీడర్ గూండాగిరి, పెట్రోల్ చల్లి హంగామా, ఆరు కేసులు, పరార్!
బెంగళూరు: బెంగళూరులో ప్రభుత్వ కార్యాలయంలో పెట్రోల్ చల్లి నిప్పటించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణస్వామి మెడకు ఉచ్చు బిగుసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణస్వామి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఆరు కేసులు నమోదు చేసిన బెంగళూరులోని రామమూర్తి నగర పోలీసులు పరారైన అతని కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
రెచ్చిపోయాడు
బెంగళూరులోని బీబీఎంపీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణస్వామి నకిలీ ఖాతా చెయ్యాలని అధికారుల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చాడని, చట్టానికి వ్యతిరేకంగా నకిలీ ఖాతా చెయ్యడానికి అధికారులు నిరాకరించడంతో ఆయన రెచ్చిపోయాడని పోలీసులు చెప్పారు.
వీడియో సాక్షం
ఫిబ్రవరి 16వ తేదీన నారాయణస్వామి పెట్రోల్ తీసుకుని బీబీఎంపీ కార్యాలయానికి వెళ్లి వీఆర్ఓ చెంగలరాయప్ప, అధికారులు, సిబ్బందిని బెదిరించాడని. తరువాత కార్యాలయంలోని ఫర్నీచర్, రికార్డులు భద్రపరచిన బీరువాల మీద పెట్రోల్ చల్లి నిప్పంటించడానికి ప్రయత్ని ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించాలని ప్రయత్నించాడని తమ దగ్గర వీడియో సాక్షం ఉందని పోలీసులు చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులు
కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణస్వామికి భయపడిన వీఆర్ ఓ చెంగలరాయప్ప మహదేవపుర బీబీఎంపీ కార్యాలయానికి బదిలీ చేయించుకున్నారని, ప్రభుత్వ కార్యాలయంలో దౌర్జన్యంగా చొరబడటమే కాకుండా అక్కడి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశామని పోలీసులు అన్నారు..
అసెంబ్లీలో వివాదం
నారాయణస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై అసెంబ్లీలో కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్, జేడీఎస్ నాయకులు విరుచుకుపడటంతో రచ్చరచ్చ అయ్యింది. సీఎం సిద్దరామయ్య ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక సతమతం అయ్యారు.
స్వచ్చందంగా కేసు
నారాయణస్వామిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యడంతో రామమూర్తి నగర పోలీసులు రంగంలోకి దిగారు. వైరల్ వీడియో సాక్షం ఆధారంగా ఐపీసీ 353, 427, 341, 504, 506 తదితర సెక్షల కింద స్వచ్చందంగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన నారాయణస్వామి కోసం గాలిస్తున్నారు.