మళ్లీ బిజెపికే పట్టం: కాంగ్రెస్కు సొంత పార్టీ సర్వే షాక్
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి నిరాశ తప్పదని తెలుస్తోంది. 2017లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని తాజాగా ఓ సర్వే తేల్చింది.
అయితే, ఆ సర్వే నిర్వహించింది కూడా కాంగ్రెస్ పార్టీనే కావడం గమనార్హం. గుజరాత్ కాంగ్రెస్ శాఖ ఓ రహస్య నివేదికను తయారుచేసి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపింది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ 97 గెలవవచ్చని కాంగ్రెస్ నివేదికలో పేర్కొంది. అలాగే అదృష్టం కలసివస్తే కాంగ్రెస్ 85 సీట్ల వరకు గెలిచే అవకాశముందని వెల్లడించింది. .

పేరున్న ఏజెన్సీల సాయం తీసుకుని 182 నియోజకవర్గాల్లో శాస్త్రీయపద్ధతుల్లో కాంగ్రెస్ సర్వే చేయించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉన్నట్టు వెల్లడించాయి. 52 సీట్లలో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని, మరో 45 స్థానాల్లో 80 నుంచి 85 శాతం వరకు విజయావకాశాలున్నట్టు తెలిపాయి.
దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ 85 సీట్లు గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని విశదీకరించారు.
కాగా, బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని, గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications