విరాళాల వెల్లువ: బీజేపీకి రూ. 785 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ. 139 కోట్లు, పార్టీల జాబితా
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు వెల్లువెత్తాయి. ముఖ్యంంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి భారీగా విరాళాలు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 2019-20 సంవత్సరానికి గానూ బీజేపీకి ఏకంగా రూ. 785.77 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి రూ. 139 కోట్లు విరాళాలు వచ్చినట్లు తెలిపింది.
కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బీజేపీకి దాదాపు ఐదు రేట్లు ఎక్కువగా విరాళాలు రావడం గమనార్హం. తమకు వచ్చే విరాళాల గురించి రాజకీయ పార్టీలు ప్రతి సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2019-2020 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 785 కోట్లు విరాళంగా వచ్చినట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో బీజేపీ వెల్లడించింది.
ఈ మొత్తంలో ఎక్కువగా ఆ పార్టీ నేతలు, కార్పొరేట్ సంస్థలు, ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారానే వచ్చాయని పేర్కొంది. పీయూష్ గోయల్, పెమా ఖండూ, కిరణ్ ఖేర్, రమణ్ సింగ్ వంటి పార్టీ నేతలు బీజేపీకి అత్యధిక విరాళాలు ఇచ్చినవారిలో ఉన్నారు. మరోవైపు ఐటీసీ, కళ్యాణ్ జువెల్లర్స్, రేర్ ఎంటర్ప్రైజెస్, అంబుజా సిమెంట్, లోధా డెవలపర్స్, మోతీలాల్ ఓస్వాల్ వంటి కార్పొరేట్ సంస్థలు కూడా బీజేపీకి నిధులు సమకూర్చాయి.
రూ. 139 కోట్లు విరాళాలుగా వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఎన్నికల సంఘానికి తెలిపింది. ఎన్సీపీకి రూ. 59 కోట్లు, సీపీఐ(ఎం)కు రూ. 19.7 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ. 8 కోట్లు, సీపీఐ రూ. 1.3 కోట్లు విరాళంగా అందుకున్నట్లు ఎన్నికల సంఘానికి తెలిపాయి. రూ. 20వేల కంటే ఎక్కువగా వచ్చిన విరాళాలనే ఈ జాబితాలో చేర్చుతారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా, 2019-20 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆడిట్ నివేదికలను సమర్పించడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించింది ఎన్నికల సంఘం.