ఢిల్లీ కాలుష్యానికి పాక్ పరిశ్రమలే కారణం-యూపీ వాదన-మూసేయమంటారా అని సుప్రీం ప్రశ్న
ఢిల్లీ కాలుష్యం అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. ఢిల్లీ కాలుష్యానికి యూపీ పరిశ్రమలు కారణం కాదని, పాకిస్తాన్ పరిశ్రమలే కారణమంటూ యూపీ సర్కార్ చేసిన వాదనపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాటిని మూసేయమని తమను ఆదేశించమంటున్నారా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ప్రశ్నించారు.
మేం పాకిస్తాన్ పరిశ్రమలను నిషేధించాలని మీరు కోరుకుంటున్నారా" అని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ యుపి ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ను అడిగారు. పాకిస్తాన్ నుండి వచ్చే కలుషితమైన గాలి ఢిల్లీలోని గాలి నాణ్యతను ప్రభావితం చేస్తోందని వాదించిన రంజిత్ కుమార్ ను ఉద్దేశించి సీజే ఈ వ్యాఖ్యలు చేశారు.
యూపీలోని పరిశ్రమలు దేశరాజధాని కాలుష్యానికి కారణం కాదని, రాష్ట్ర పరిశ్రమల నుచి వచ్చే కాలుష్యం తగ్గిపోవడంతో పాటు కలుషిత గాలి ఢిల్లీ వైపు వెళ్లడం లేదని రంజిత్ వాదించారు. యూపీలో పరిశ్రమల మూసివేతపై యోగీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పరిశ్రమలు 8 గంటలు మాత్రమే పని చేయడానికి జాతీయ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నిర్ణయం చెరకు, పాడి పరిశ్రమలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.
నిన్న ఢిల్లీలో వర్షం కురిసినా కాలుష్యం ఏమాత్రం తగ్గలేదు. ఇవాళ ఢిల్లీలో గాలి నాణ్యత 335 గా నమోదైంది. ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలపై సాధారణ నిషేధం ఉన్నప్పటికీ, ఆసుపత్రుల నిర్మాణాన్ని కొనసాగించడానికి సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుమతించింది. ఢిల్లీలో వాయుకాలుష్యంతగ్గించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అయినా కాలుష్యం స్ధాయిలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. దీంతో పొరుగున ఉన్న యూపీలో చెరుకు, పాడి పరిశ్రమల్ని కూడా మూసేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ యూపీ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. అయితే విచారణలో యూపీ పరిశ్రమల వల్ల కాలుష్యం రావడం లేదని, పాకిస్తాన్ పరిశ్రమల నుంచి వస్తుందని యూపీ సర్కార్ వాదించింది. ఈ వాదనతో సుప్రీంకోర్టు విభేదించింది.