కమలానికి ‘ఓట్ల’ కష్టాలు: రిజర్వేషన్ల దుర్వినియోగంపై ఆదివాసీల ఆందోళన..18న భేటీ
అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం ప్రసాదించి హక్కులను తారుమారుచేసి.. రాజకీయ ప్రయోజనాల కోసం గుజరాత్ లోని రాష్ట్ర ప్రభుత్వం
అహ్మదాబాద్/గాంధీనగర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న గుజరాత్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన పాటిదార్ల నాయకుడు హార్దిక్ పటేల్.. ఓబీసీ హక్కుల పోరాట నాయకుడు అల్పేశ్ ఠాకూర్, దళిత ఉద్యమ కార్యకర్త జిగ్నేశ్ మేవానీలతో కమలనాథులు సతమతం అవుతూ ఉంటే ఆదివాసీలు తాజాగా ఆందోలనకు దిగడం అనూహ్య పరిణామమే. 2007లో దళితుల ఓట్లను పొందడం కోసం కొన్ని సామాజిక వర్గాలను ఎస్టీలుగా మార్చింది నాటి గుజరాత్ ప్రభుత్వం. తాజాగా 2017లోనూ మరో నోటిఫికేషన్ జారీ చేసింది విజయ్ రూపానీ సర్కార్. వీటి పర్యవసనాలు ఇటీవల డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ల నియామకం చేపట్టే వరకు ఆదివాసీలకు అర్థం కాలేదు. తమ భవిష్యతేమిటో తేలిపోవడంతో రిజర్వేషన్లలో మార్పులను నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళన బాట పట్టారు.
Recommended Video
షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో ఇతర కులస్తులను చేర్చడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 15 శాతం ఉన్న ఆదివాసీలు, ఎస్టీ సర్టిఫికెట్ కలిగిన దళితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. ఆడవుల్లో నివసించే గిరి వాసులకే కాక రాబ్రి, భార్వడ్, చరణ్ కులస్థులకు కూడా ఎస్టీ హోదా కల్పించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరులకు కూడా రిజర్వేషన్లు కల్పించడం వల్ల తమకు కేటాయించిన రిజర్వేషన్లు నీరుగారి పోతున్నాయని ఆరోపిస్తూ వారు రాష్ట్రంలో పలుచోట్ల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
2007, 2017ల్లో గుజరాత్ సర్కార్ వేర్వేరు నోటిఫికేషన్లు
ప్రత్యేకించి రాబ్రి, భార్వడ్, చరణ్ కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చడంవల్ల తమకు కేటాయించిన రిజర్వేషన్లు నీరుగారి పోతాయని ఆరోపిస్తూ వారు రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాబల్య ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నట్టు సంఘాల నాయకులు తెలిపారు. తాజాగా ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే బీజేపీ ప్రభుత్వం 2007, 2017ల్లో జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేసిందని సమస్త ఆదివాసీ సమాజ్ అధ్యక్షులు ప్రదీప్ గరాషియా ఆరోపించారు.‘ఎన్నికల తర్వాత రాబ్రి, భార్వడ్, చరణ్ కులస్థులనే కాక ఇతర కులాలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చే ప్రమాదం ఉంది. అందుకే మా ఆందోళనలను ఉధృతం చేస్తున్నాం' అని చెప్పారు. 1956 ఉత్తర్వులతో ఎలాంటి సమస్యాలేదు. 'గుజరాత్ ప్రభుత్వం 2007లో, 2017లో జారీ చేసిన నోటిఫికేషన్లు సమస్యాత్మకమయ్యాయి' అని సమస్త ఆదివాసీ సమాజ్ అధ్యక్షులు ప్రదీప్ గరాషియా చెప్పారు. ఈ సమ్మేళనంలో తమ సమస్యను సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఆందోళన కార్యాచరణను రూపొందించనున్నట్లు ప్రదీప్ గరాషియా తెలిపారు. ఈనెల 18వ తేదీన తాపి జిల్లాలోని వైరా వద్ద రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దీనికి 29 ట్రైబల్ ఉప కులాల అధ్యక్షులు హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఆదివాసీలను సమీకరిస్తున్నారు.
రాబ్రీ, భార్వడ్, చరణ్ కులాల వారి అభ్యర్థనకు నో
తాత ముత్తాతలు అడవుల్లో నివసించిన ఆదివాసీలకు 1956లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ హోదాను కల్పించింది. అంతకుముందు ఎప్పుడో తమ తాత ముత్తాతలు కూడా అడవుల్లో నివసించారని, తమకు ఎస్టీ హోదా ఇవ్వాలని ముందుకు వచ్చిన రాబ్రి, భార్వడ్, చరణ్ కులాల వారిని ఎస్టీల కింద గుర్తించేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు. కాగా 2007లో రిజర్వేషన్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. కాగా, 2017 జనవరిలో మరోసారి సవరించి ఆదివాసీల వారసులు ఎక్కడున్నా ఎస్టీ సర్టిఫికెట్ తీసుకోవచ్చనే వెసులుబాటును కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకుమించి ఈ నోటిఫికేషన్ల వల్ల లాభనష్టాలేమిటో ఆదివాసీలు గ్రహించలేదు.
భవిష్యతేమిటో గ్రహించాకే ఆదివాసీల ఆందోళన బాట
మూడు నెలల క్రితం జరిగిన 68 మంది డిప్యూటి పోలీసు సూపరింటెండెంట్, డిప్యూటీ కలెక్టర్లకు నియామకాలను ఎస్టీలకే కేటాయించగా, వాటిలో 35 పోస్టులు రాబ్రి, భార్వడ్, చరణ్ కులస్థులకు లభించాయి. కొత్త నోటిఫికేషన్ల ప్రకారం వారికి ఎస్టీ హోదా లభించడమే అందుకు కారణం. 1956లో ఎస్టీ హోదాకు అనర్హులైన వీరికి ఇప్పుడు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వడంతో తాము నష్టపోతున్నామని గ్రహించిన ఆదివాసీలు, వారి ఉపకులాలు ఇప్పుడు ఆందోళన బాటపట్టాయి. కీలక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివాసీలను కూడా మంచి చేసుకోవడం కోసం 2007 తోపాటు గత అక్టోబర్ 11వ తేదీన జారీ చేసిన తాజా నోటిషికేషన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
పరిస్థితి చక్కదిద్దకుంటే నష్టపోక తప్పదన్న బీజేపీ ఎంపీ మన్సూన్ వాసవ
ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే స్థానిక బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్లను రద్దు చేసిందని, ఎన్నికల అనంతరం ఒక్క రాబ్రి, భార్వడ్, చరణ్ కులస్థులకే కాకుండా ఇతర కులాలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ కొత్త చట్టం తీసుకొచ్చే ప్రమాదం ఉందని గ్రహించి ఆదివాసీలు పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.సకాలంలో ఆదివాసీల ఆందోళనను విరమింప చేయకపోతే రానున్న ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుందని బారుచ్ బీజేపీ ఎంపీ మన్సుఖ్ వాసవ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే దూరమైన పాటీదార్లు, దూరం అవుతున్న ఠాకూర్లును ఎలా మంచి చేసుకోవాలనో అర్థం కాక తలపట్టుకు కూర్చున్న పాలక పక్ష బీజేపీకి ఆదివాసీల సమస్య మరింత తలనొప్పిగా తయారైంది. ఈ సమస్య పరిష్కారంలో తాత్సారం జరిగితే తల బొప్పికట్టక తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎస్టీలకు 27 అసెంబ్లీ సీట్లు రిజర్వై ఉన్నాయి. వాటిలో గత ఎన్నికల్లో 16 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, బీజేపీ పది సీట్లను కైవసం చేసుకొంది. ఇప్పుడు 25 సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీకి.. ఆదివాసీల ఆందోళన మేలు చేసేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.