తెలంగాణలోనే కాదు..అక్కడ కూడా పదో తరగతి పరీక్షలు రద్దు: ఇక ఏపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో?
చెన్నై: కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్న తమిళనాడులో కూడా పదో తరగతి పరీక్షలురద్దు అయ్యాయి. కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను నిర్వహించట్లేదని తమిళనాడు పబ్లిక్ పరీక్షల నిర్వహణ బోర్డు వెల్లడించింది. విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతోన్నందున.. దాని బారిన పడకుండా విద్యార్థులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో 24 వేల వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పెద్ద సంఖ్యలో పేషెంట్లు మరణించారు. రోజూ వందలాదిగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, అటెండెన్స్తో మిగతా 20 శాతం మార్కులు కలపుతామని దీని ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ నిర్ణయిస్తామని అన్నారు. తమిళనాడు వ్యాప్తంగా సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది.
Recommended Video
దేశంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన రెండో రాష్ట్రం తమిళనాడు. తెలంగాణ ఇప్పటికే టెన్త్ క్లాస్ పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థులందరినీ ఇంటర్మీడియట్కు ప్రమోట్ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైనప్పటికీ.. ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. పరీక్షలను ఏకంగా రద్దు చేసింది. కాగా.. ఏపీలో కూడా పదో తరగతి పరీక్షలను ఇంకా నిర్వహించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.