మమతా బెనర్జీ సహా అందరి మెనూల్లో మటన్, రొయ్యలు మాయం
కోల్కతా: పొదుపు చర్యల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్యాహ్న భోజనం మెనూలో నుంచి మటన్, రొయ్యలను తొలగించారు. ప్రజాధనాన్ని విలాసవంతమైన కార్యక్రమాలు, ఈవెంట్లకు ఉపయోగించకుండా పొదుపు చర్యలు పాటించాలని మమతా అధికారులను ఆదేశించారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపరమైన ఖర్చును తగ్గించేందుకు వీలుగా రాష్ట్రంలోని పన్నెడు ప్రభుత్వ శాఖల్ని కలిపి బడ్జెట్ కేటాయించారు. ప్రజల సొమ్మును ప్రజల కోసం చేపట్టే ప్రాజెక్టులకే వెచ్చించాలనే మమత ప్రజాధనం పొదుపు కోసం 15 అంశాలతో కూడిన కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
అధికారిక సమావేశాలు, ఈవెంట్లలో డెకరేషన్, రిప్రెష్మెంట్స్ ఖర్చులు తగ్గించాలని మమతా ఆదేశించారు. అధికారులు విదేశాలతో పాటు ఢిల్లీ పర్యటనలు తగ్గించాలని, కార్యాలయాల్లో ఇకపై కొత్తగా ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేయవద్దన్నారు. అధికారులు తప్పనిసరి అయి విమానాల్లో ప్రయాణించాల్సి వస్తే ఎకానమీ క్లాస్లోనే వెళ్లాలన్నారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.
బెంగాల్ సచివాలయంలో మంత్రులు, అన్ని శాఖల మెనులో కేవలం పన్నీర్, చేపల కూర మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. మంత్రులు, అధికారులు ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు పైవ్ స్టార్ హోటళ్లలో బస చేయవద్దన్నారు. ఈ ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయన్నారు.