బీహార్కు ప్రత్యేక హోదా కోసం నితీష్ డిమాండ్, 2011 జనాభా లెక్కన నిధులివ్వాలి
పాట్నా: నోట్ల రద్దు విషయంలో మూడు రోజుల క్రితం బ్యాంకు అధికారుల తీరును తప్పుబట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
బీహార్కు ప్రత్యేక హోదా వచ్చి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. విభజన తర్వాత బీహార్ బాగా వెనుకబడిందన్నారు. కేంద్రమే సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా బాగా తగ్గిందని చెప్పారు.
గత ఏడాది బీజేపీతో కలిసిన అనంతరం సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోయారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పదేపదే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ హోదా కోసం డిమాండ్ చేశారు.
15వ ఆర్థిక సంఘం ప్రయోజనాలు రాష్ట్రాలకు ఏ విధంగా వర్తిస్తాయో తెలపాలన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2011 లెక్కల ప్రకారం రాష్ట్రాలకు నిధులు పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం నిధులు కేటాయిస్తేనే రాష్ట్రాలు ముందుకు వెళ్తాయన్నారు.
బీహార్ రాష్ట్ర విభజన చట్టం 2000 ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. 15వ ఆర్థిక సంఘం పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచడాన్ని నితీష్ వ్యతిరేకించారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షతన ఓ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి బీహార్ ప్రత్యేక ఆర్థిక అవసరాలను చూసుకోవాలని ఆ చట్టం స్పష్టంగా చెప్పినట్లు గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ ఉండటంతో దాని ఆధ్వర్యంలో అలాంటిదే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. తలసరి ఆదాయం, విద్య, ఆరోగ్యం, విద్యుత్లాంటి అంశాల్లో జాతీయ సగటు కంటే బీహార్ సగటు చాలా తక్కువగా ఉందని, అందుకే తాము హోదా డిమాండ్ చేస్తున్నామన్నారు.