ఎన్నికల తర్వాత నితీష్ బీజేపీకి షాకిస్తారు! 2024 మోడీకి పోటీగా నిలుస్తారు: చిరాగ్ పాశ్వాన్
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఎన్డీఏ సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్. ఓ వైపు బీజేపీ అగ్రనేతలకు విశ్వాసం చూపిస్తూనే ఆ పార్టీ రాష్ట్ర నేతలు, నితీష్ కుమార్పై మండిపడుతున్నారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ పార్టీ అభ్యర్థులపైనే ఎల్జేపీ అభ్యర్థులను బరిలో దింపడం గమనార్హం.
గతంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తోంది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన నితీష్ కుమార్.. ఇప్పుడు ఆయన ఫొటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ ఏరుదాటాక తెప్పతగిలేసే రకమని విమర్శించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, అదే జరుగుతుందని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి షాక్ తప్పదన్నారు. 2024లో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని నితీష్ కుమార్ భావిస్తున్నారని చెప్పుకొచ్చారు.
నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలో అనేక పథకాల్లో అవినీతి చోటు చేసుకుందని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. కాగా, 243 స్థానాలు గల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ 140 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎల్జేపీ అభ్యర్థులు ఎక్కువగా జేడీయూ పోటీ చేస్తున్న స్థానాల నుంచే బరిలో దిగడం గమనార్హం. బీజేపీ పోటీ చేస్తున్న 110 స్థానాలకు ఎల్జేపీ దాదాపు దూరంగా ఉంది. అయితే, హసన్పూర్ నియోజకవర్గంలో జేడీయూ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రత్యర్థిగా బరిలో నిలిచిన అర్జేడీ సుప్రీమో లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు చిరాగ్ పాశ్వాన్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Recommended Video
అక్టోబర్ 28న తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. రెండో దశలో 94 సీట్లకు నవంబర్ 3, 78 స్థానాలకు నవంబర్ 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఇక నవంబర్ 10 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.