థర్డ్ కాదు, మెయిన్ ఫ్రంటే..: బీజేపీని ఢీకొట్టడమే లక్ష్యం, శరద్ పవార్తో నితీష్ కుమార్ భేటీ
న్యూఢిల్లీ: రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ను కలిశారు. 2024 ఎన్నికల్లో నాయత్వం ఎవరు వహిస్తారనేది తర్వాత నిర్ణయించుకోవచ్చన్నారు.
మెయిన్ ఫ్రంటే.. 2024 ఎన్నికలు భిన్నంగానే అంటూ నితీష్ కుమార్
మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించిన నితీష్ కుమార్ ఆఖరి రోజైన బుధవారం శరద్ పవార్ తో దాదాపు 30 నిమిషాలపాటు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే అది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అవుతుందన్నారు. బీజేపీయేతర పార్టీలతో సమావేశం చాలా బాగా జరిగిందని, సుదీర్ఘ చర్చలు జరిపినట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లోని బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే.. 2024 లోక్ సభ ఎన్నికలకు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయన్నారు. తాను కలిసిన నేతలందరితోనూ సానుకూలంగా చర్చలు సాగాయన్నారు.
సోనియాను కలుస్తా.. ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటూ నితీష్
'ఢిల్లీలో నేతలందరినీ కలిశాను, ఎన్డీయే నుంచి బయటకు వచ్చినందుకు చాలా మంది కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ ఐక్యత ఉండాలని, రాబోయే రోజుల్లో దేశంలో అలాంటి వాతావరణం నెలకొంటుందని అందరూ కోరుకుంటున్నారని బీహార్ సీఎం దేశ రాజధానిలో భట్టాచార్యను కలిసిన అనంతరం మీడియాతో అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కలుస్తానని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేత తెలిపారు. అవసరమైతే మేం (ప్రతిపక్ష నేతలు) మరోసారి కలుస్తాం.. అందరి వైఖరి సానుకూలంగా ఉంది.. థర్డ్ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలని కోరుకుంటున్నాం.. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ఈ పనిని కొనసాగిస్తానని చెప్పారు నితీష్ కుమార్. బీజేపీ ప్రజల కోసం ఏమీ చేయడం లేదని ఆరోపించిన నితీశ్, కాషాయ పార్టీకి ప్రత్యామ్నాయం చూపే సమయం ఆసన్నమైందని అన్నారు.
జాతీయ నేతలతో నితీష్ కుమార్ కీలక భేటీలు
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన నితీశ్, రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఐఎన్ఎల్డీ అధినేత ఓపీ చౌతాలా, సమాజ్వాదీ పార్టీ (SP) స్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, అతని కుమారుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు. అధికారం చేతిలో ఉన్న వారే దేశంలో ఎక్కడ చూసినా నష్టాన్ని సృష్టిస్తున్నారని అందరూ గ్రహించారని ప్రతిపక్ష నేతలతో మారథాన్ సమావేశం అనంతరం నితీశ్ అన్నారు.