అధికార పార్టీ నేతల మనోభావాలు గాయపడ్డాయ్ - రాహుల్ గాంధీపై వరుస కేసులు..!!
ముంబై: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీపై మరో కేసు నమోదైంది. మహారాష్ట్ర పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు చెందిన బాలాసాహెబాంచి శివసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల వ్యవధిలో రాహుల్ గాంధీపై నమోదైన రెండో కేసు ఇది. గురువారం ఆయనపై మహారాష్ట్రలోనే కేసు నమోదైంది.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతీయ జనత పార్టీ నాయకులకు ఆరాధ్యుడు వీర్ సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ పరిణామం చోటు చేసుకుంది. తొలుత వీర్ సావర్క్ ముని మనవడు రంజిత్ సావర్క్, శివసేన ఎంపీ రాహుల్ షెవాలె ఆయనపై శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీర్ సావర్కర్ను కించపరిచారంటూ ఆరోపించారు. స్వాతంత్ర్య సమరయోధులను అవమానపర్చడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీపై తొలి కేసు నమోదైంది.
ఇవ్వాళ తాజాగా బాలాసాహెబాంచీ శివసేన నాయకులు వందనా సుహాస్ డోంగ్రే సహా మరికొందరు రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీర్ సావర్కర్పై చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను గాయపర్చాయని పేర్కొన్నారు. వీర్ సావర్కర్ను అవమానించడం అంటే స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచినట్టేనని విమర్శించారు. కోట్లాదిమంది హిందుత్వ సిద్ధాంతాలను అవమానించినట్టేనని ఆరోపించారు.
ఈ ఫిర్యాదు మేరకు థానే నగర్ పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్లు 500, 501 కింద కేసు పెట్టారు. ఈ సందర్భంగా సుహాస్ డోంగ్రే మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన వీర్ సావర్కర్ను అదే మహారాష్ట్ర గడ్డపై రాహుల్ గాంధీ అవమానించారని, దీన్ని తాము సహించబోమని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. వీర్ సావర్కర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతకుకుందు సుహాస్ డోంగ్రే సహా పలువురు నాయకులు థానే నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలను తీశారు. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు వ్యతిరేకంగా నినదించారు. వీర్ సావర్కర్కు జోహార్లు అర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో వీర్ సావర్కర్ ఎన్నో త్యాగాలు చేశారని, జీవితాన్ని ధారపోశారని అన్నారు.