చిన్నారిపై రేప్: నిరసనగా ర్యాలీ, కోసేయాలని..(పిక్చర్స్)
బెంగళూరు: నగరంలోని ఓ స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా నిరసనకారులు భారీ ఎత్తున ఉద్యమించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు, ఏబివిపి కార్యకర్తలు రోడ్లపై ర్యాలీ నిర్వహించారు.
తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సాక్షాలను తారుమారు చేసేందుకు స్కూలు యాజమాన్యం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. దీనిపై స్పందించిన కర్నాటక ముఖ్యమత్రి సిద్ధరామయ్య అత్యాచార నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
జులై 2న ఇద్దరు పాఠశాల ఉద్యోగులే బాధిత బాలిక, ఒకటో విద్యార్థిని(6)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కుందలహళ్లి సమీపంలోని వర్థూర్ - హరలూర్ రోడ్డుపై గల విబ్జియార్ స్కుల్లో జరిగింది. ఈ ఘటన గత గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఒడిషాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూతురు. అమ్మాయి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తరగతుల్లో క్లాసులు జరుగుతుండగా అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో అనుమానితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ జిమ్ ఇన్స్ట్రక్టర్, సెక్యూరిటీ గార్డును విచారిస్తున్నట్లు వారు తెలిపారు. రెండోసారి గుర్తింపు పరేడ్ జరిపి నిందితులను గుర్తిస్తామని వారు చెప్పారు. స్కూల్లో 27 మంది జిమ్ ఇన్స్ట్రక్టర్లు ఉన్నారని, దాంట్లో నిందితులను గుర్తించడం చాలా కష్టంగా ఉందని డిసిపి టిడి పవార్ చెప్పారు. బాలిక తీవ్ర భయాందోళనలకు గురైందని ఆయన అన్నారు. బాలిక వాంగ్మూలం రికార్డు చేస్తామని ఆయన చెప్పారు. అనుమానితులు చెప్పిన విషయాలను బాలిక వాంగ్మూలంతో పోల్చి చూస్తామని అన్నారు. బాలికను తాము ఇబ్బంది పెట్టదలుచుకోలేదని, దీంతో దర్యాప్తు నెమ్మదిగా జరుగుతోందని అన్నారు. సున్నితంగా ఈ కేసును పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు.