ఉద్యోగినిపై లైంగిక వేధింపులు: పచౌరిపై వేటు
న్యూఢిల్లీ: ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ పదవి నుంచి ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణవేత్త ఆర్కే పచౌరీపై గురువారంనాడు వేటు పడింది. ఆ పదవి నుంచి ఆయనను తొలగించారు. పచౌరీ తన పదవిని దుర్వినియోగపరిచాడని అంతర్గత విచారణలో తేలింది. లైంగిక వేధింపుల విషయంలో సంస్థ నియమాలను ఆయన ఉల్లంఘించినట్లు తేల్చారు.
పచౌరి స్థానంలో ఇంధన సామర్థ్య బ్యూరో డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ను నియమించారు. ఇంతకు ముందు పచౌరీని ఆ పదవి నుంచి తొలగించి ఉండాల్సిందని బాధితురాలు ఓ న్యూస్ చానెల్తో అన్నారు. తన కింద పనిచేసే ఒక మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించిన కేసు ఆయనపై ఉంది. ఈ కేసులో ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.

కోర్టు గతంలో ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరారు. పచౌరీ అరెస్ట్ ఖాయమని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనను తేరీ సంస్థ చీఫ్ పదవి నుంచి తొలగించారు. పచౌరీ గతంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగానికి అధిపతిగా వ్యవహరించారు కూడా.
ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్రమశిక్షణా సంఘం పచౌరీపై చర్చలకు సిఫార్సు చేసింది. పచౌరీ ఓ మహిళతో వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవడానికి పదే పదే ప్రయత్నించాడని, అది లైంగిక వేధింపులకు దారి తీసిందని విచారణలో తేలింది.
ఎస్ఎంఎస్ మెసేజ్లు, ఈ మెయిల్స్, వాట్సప్ మెసేజ్లు సాక్ష్యాలుగా పనికి వచ్చాయి. రెండేళ్ల పాటు పచౌరీ తనను లైంగిక వేధించాడని బాధితురాలు ఆరోపించింది.












Click it and Unblock the Notifications