ఢిల్లీలో పాక్ నటుల్ని అడ్డుకున్న శివసేన, నినాదాలు
ఢిల్లీ: శివసేన కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో తాజాగా శివసేన పాకిస్తాన్ వారిని అడ్డుకుంది. గుర్గావ్లో ఓ నాటక ప్రదర్శనలో పాల్గొన్న పాకిస్తాన్ నటుల బృందాన్ని శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు.
నాటక ప్రదర్శన జరుగుతున్న వేదిక పైకి వెళ్లిన శివసేన కార్యకర్తలు పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాటక ప్రదర్శనకు కాసేపు అంతరాయం ఏర్పడింది.
పాకిస్థాన్ జెండాలు పీకేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన శనివారం నాడు జరిగింది.
పాకిస్తాన్ గజల్ సింగర్ గులాంకు హెచ్చరికలు, పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ సందర్భంగా సుదీంధ్ర కులకర్ణిపై ఇంకు దాడితో పాటు బీసీసీఐ సమావేశాన్ని సేన కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా, గుర్గావ్లోను శివసేన అడ్డుకుంది.
మోడీ ఉంటేనే బీజేపీకి ఆక్సిజన్: శివసేన
బిజెపి పైన శివసేన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీజేపీకి ప్రధాని మోడీ రూపంలో ఆక్సిజన్ అందిన కారణంగానే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, మోడీ ప్రభావం తగ్గగానే బీజేపీ కుదేలైపోతుందని శివసేన అధికార పత్రిక 'సామ్నా'లో ప్రత్యేక వ్యాసాన్ని రాసింది.
తమ పార్టీ ఎప్పటికైనా హిందుత్వం, దేశభక్తి వైపు మాత్రమే ఉంటుందని పేర్కొంది. భావ సారూప్యత ఉన్న పార్టీలతో మాత్రమే కలసి ముందడుగు వేస్తుందన్నారు. ఈ దసరా వేడుకలను వైభవంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్తు తమదేనన్న సంకేతాలు ప్రతి ఒక్కరికీ పంపామని పేర్కొంది.