పవార్ కుటుంబంలో పవర్ చిచ్చు.. వారసుల రాకతోనే చీలిక.. సుప్రియా సెన్సేషనల్ కామెంట్స్
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో ముసలం పుట్టింది. వారసుడు అనుకొన్న అజిత్ పవార్ పార్టీని చీల్చడం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. అధినేత శరద్ పవార్కు కుడిభుజంగా ఉన్న అజిత్ ఊహించని విధంగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దేశ రాజకీయాలను కుదిపేసింది. అజిత్ పార్టీ చీల్చడం వెనుక అతడి అభద్రతా భావమే కారణమనే కోణం వెలుగులోకి వచ్చింది. సొంత కుటుంబంలో అజిత్ పవార్ను అభద్రతకు గురిచేసిన అంశాలు ఏమిటంటే..
శరద్ పవార్ స్ఫూర్తితోనే అజిత్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడు అనంతరావు కుమారుడే అజిత్ పవార్. చిన్నాన్న శరద్ పవార్ను స్ఫూర్తిగా తీసుకొని మహారాష్ట్ర కో-ఆపరేటివ్ రంగాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయంగా ఎదిగాడు. 1992 వరకు శరద్ పవార్ వెంటనే నడిచాడు. ఎన్సీపీ ఏర్పాటు తర్వాత శరద్ పవార్కు రాజకీయ వారసుడు అజిత్ అని అందరూ అనుకొన్నారు. కానీ అంతలోనే అజిత్కు సుప్రియా సూలే రూపంలో ఝలక్ తగిలింది.
‘అజిత్ ప్రతీ అడుగు అనుమానమే.. బాడీలాంగ్వేజ్లో తేడా, ఫోన్ స్విచ్ఛాఫ్, వెన్నుపోటే'
సుప్రియా సూలే రాకతో
2009 పార్లమెంటరీ ఎన్నికల్లో సుప్రియా సూలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో అజిత్ పవార్కు సమాంతరంగా నాయకత్వం ఏర్పాటైనట్టు కనిపించింది. అయితే నాయకత్వం విషయంలో తమ మధ్య ఎలాంటి పోటీ లేదని పలుమార్లు సుప్రియా, అజిత్ బహిరంగంగానే ప్రకటన చేశారు. అప్పటి వరకు సవ్యంగానే సాగింది. ఎప్పుడైతే రాజకీయాల్లోకి శరద్ పవార్ మనవుడు రోహిత్ పవార్ అడుగుపెట్టాడో అప్పడే అజిత్లో అభద్రతాభావం పెరిగిపోయిందనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపించింది.
2019 ఎన్నికల తర్వాత విభేదాలు తీవ్రస్థాయికి
పవార్ కుటుంబంలో అధిపత్యం పోరు కొనసాగుతుండగా.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ తన కుమారుడు పార్థ్ పవార్ను మావల్ స్థానం నుంచి పోటీ చేయడం శరద్ పవార్ ఆగ్రహానికి కారణమైంది. పార్థ్ను మావల్ నుంచి పోటీ చేయించడంపై శరద్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు అప్పట్లో మీడియాలో ప్రచారమైంది.
అజిత్ పవార్ కొడుకు రాకతో
మావల్ స్థానం నుంచి తన కుమారుడు పార్థ్ పవార్ను గెలిపించుకోవడానికి అజిత్ శాయశక్తులా ప్రయత్నించినా లాభం లేకపోయింది. తొలిసారి పోటీ చేసి పార్థ్ ఓటమి పాలవ్వడం పవార్ కుటుంబంలో గందరగోళానికి కారణమైంది. బారామతి నుంచి సుప్రియా సూలే గెలిచినా ఆ కుటుంబంలో విజయోత్సవం జరుపుకోకుండా ఉండటం అనేక చర్చలకు దారి తీసింది. ఇలాంటి సంఘటనలు తాజాగా అజిత్ అభద్రతా భావానికి గురిచేసి బీజేపీతో చేతులు కలిపిలా చేసిందనే వాదన వినిపిస్తున్నది.
పార్టీ, కుటుంబం చీలిపోయిందని సుప్రియా
శనివారం దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుప్రియా సూలే స్పందించారు. పార్టీ, ఫ్యామిలీలో దారుణమైన చీలిక వచ్చింది అని వ్యాఖ్యలు చేసింది. దీంతో శరద్ పవార్ పార్టీలోనే కాకుండా ఫ్యామిలీలో కూడా చీలిక తప్పలేదనే మాట మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్నది.