ఆర్ టీసీ మెరుపు సమ్మె, రూ. 100 కోట్లు నష్టం, అసెంబ్లీలో ప్రభుత్వం, ప్రతిపక్షం, చేతకాని !
Recommended Video
చెన్నై: తమిళనాడులో ఆర్ టీసీ కార్మికుల మెరుపు సమ్మె కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ దెబ్బ పడింది. గత ఏడు రోజుల నుంచి ఆర్ టీసీ కార్మికులు రోడ్డు ఎక్కడంతో అన్ని డీపోల్లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఆర్ టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వానికి రూ. 100 కోట్లకు పైగా నష్టం వచ్చిందని సమాచారం. అసెంబ్లీలో ప్రభుత్వం, ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ప్రభుత్వం వెనకడుగు
తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఆర్ టీసీ కార్మిక సంఘాలు పలు డిమాండ్లు పరిష్కరించాలని మనవి చేశారు. వేతనాలు పెంచాలని, కనీస కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశారు. అయితే ఆర్ టీసీ కార్మికుల కోర్కెలు తీర్చడానికి ప్రభుత్వం వెనకడుగు వేసింది.
షాక్ ఇచ్చిన ఆర్ టీసీ
గురువారం అర్దరాత్రి నుంచి ఆర్ టీసీ కార్మికులు ఒక్క సారిగా మెరుపు సమ్మెకుదిగారు. ఎక్కడి బస్సులు అక్కడే వదిలేసిన ఆర్ టీసీ కార్మికులు మా డిమాండ్లు తీర్చే వరకూ విధులకు హాజరుకామని తేల్చి చెప్పారు. ఆర్ టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు సమ్మెలో పాల్గొంటున్నారు.
వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్
సమ్మె విరమించి వెంటనే విధులకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు రవాణా శాఖ మంత్రి ఎంఆర్. విజయ్ భాస్కర్ హెచ్చరించారు. విధులకు హాజరుకావాలని స్వయంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మనవి చేసినా డోంట్ కేర్ అంటూ కార్మికులు సమ్మో కొనసాగిస్తున్నారు.
అసెంబ్లీలో ప్రభుత్వం, ప్రతిపక్షం
ఆర్ టీసీ కార్మికులను ప్రతిపక్ష డీఎంకే పార్టీ రెచ్చగొట్టి సమ్మె చేయిస్తున్నదని శాసన సభ సమావేశంలో స్వయంగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆరోపించారు. సమస్యలు పరిష్కరించలేని చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉండటం వలనే కార్మికులు రోడ్డు ఎక్కారని డీఎంకే ఆరోపించింది.
ఏడు రోజుల్లో రూ. 100 కోట్లు
ఆర్ టీసీ కార్మికుల సమ్మె కారణంగా తమిళనాడు రవాణా శాఖకు ప్రతి రోజూ 65 శాతం ఆదాయం తగ్గిపోయింది. ఆర్ టీసీ సమ్మె కారణంగా తమిళనాడు రవాణా శాఖ కు దాదాపు రూ. 100 కోట్లకు పైగా నష్టం వచ్చిందని అధికారులు అంటున్నారు.