మాజీ సీఎంకు మూడేళ్లు జైలు, రూ. 25 లక్షలు జరిమానా, ఐఏఎస్ అధికారులు?
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. శనివారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు శిక్షఖరారు చేసింది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.25లక్షల జరిమానా విధిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి భరత్ పరషర్ తీర్పు చెప్పారు. కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్.సి.గుప్తాకు కూడా మూడేళ్ల జైలు శిక్ష, రూ. ఒక లక్ష రూపాయలు జరిమానా విధించారు.
హైకోర్టులో అప్పీలకు?
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు మధు కోడా, మరో ముగ్గురు దోషులకు రెండు నెలల తాత్కాలిక బెయిల్ ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసింది. జార్ఖండ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎ.కె.బసుకి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చెప్పింది.
కోల్ కతా కంపెనీతో డీల్!
కోల్ కతాలోని వినీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీకి రూ. 50 లక్షల జరిమానా విధించామని సీబీఐ ప్రత్యేక కోర్టు చెప్పింది. జార్ఖండ్ లో విసుల్ కంపెనీకి బొగ్గు గనుల కేటాయించడంలో అక్రమాలు జరిగాయని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది.
2007లో పక్కా ప్లాన్
సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రకారం జార్ఖండ్ లోని ఉత్తర రాజ్ హరా బొగ్గు క్షేత్రం కేటాయించాలని కోరుతూ కోల్ కతాకు చెందిన వినీ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ 2007 జనవరి 8వ తేదీన జార్ఖండ్ ప్రభుత్వానికి మనవి చేసింది. ఉక్కు మంత్రిత్వ శాఖ ఇందుకోసం జార్ఖండ్ ప్రభుత్వానికి సిఫార్సు చేయ్యలేదు.
మన్మోహన్ సింగ్ కు వాస్తవాలు?
కోల్ కతా కంపెనీకి గనులు కేటాయించాలని అప్పటి బొగ్గు శాఖ ప్రధాన కార్యదర్శి హెచ్ సీ. గుప్తా ఆధ్వర్యంలోని సంఘం సిఫార్సు చేసింది. ఆ సమయంలో కేంద్ర బొగ్గు శాఖను నిర్వహిస్తున్న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద వాస్తవాలను దాచిపెట్టి అనుమతి ఇచ్చారు.
కుమ్మక్కు అయ్యారు
బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో మధు కోడా, ఎ.కె.బసుతో పాటు ఇతర అధికారులు కుమ్మక్కయ్యారని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం చెప్పింది. బొగ్గు కుంభకోణంపై మొత్తం 30 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ నాలుగు కేసుల్లో తీర్పు వచ్చింది.