బీహార్లో దారుణం: తనిఖీలు చేస్తుండగా.. ఐదుగురు పోలీసుల మృతి!
బీహార్ లోని అఖురహా అనే గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసుల పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాట్నా: బీహార్ లోని అఖురహా అనే గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసుల పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడ్డవారిలో డీఎస్పీ సహా ఓ ఇన్ చార్జీ పోలీస్ అధికారి, కానిస్టేబుళ్లు ఉన్నారు. ప్రమాదంలో పోలీసు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.
డీఎస్పీ మురారీ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి అఖురహా గ్రామం వద్ద కొంతమంది పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో మోతిహారి వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ వాహనం నేరుగా పోలీసుల పైకి దూసుకొచ్చింది.
తొలుత పోలీస్ వాహనాన్ని ఢీకొట్టడంతో అది గాల్లో లేచి 40అడుగుల దూరంలో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడే ఉన్న ఐదుగురు పోలీస్ అధికారుల మీదకు వాహనం దూసుకెళ్లడంతో వారంతా అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ముజఫర్ నగర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఘటనాస్థలికి చేరుకున్న మెజిస్ట్రేట్ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేగాన్ని నియంత్రించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? తాగిన మైకంలో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందా?, లేక నిద్ర మత్తులో జరిగిందా? అన్నది ఆరా తీస్తున్నారు.