హైపిచ్ లో హైడ్రామా: శివసేనకు మద్దతివ్వడానికి శరద్ గ్రీన్ సిగ్నల్? ఎటూ తేల్చిన సోనియా..!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు గంట గంటకో మలుపు తిరుగుతున్నాయి. ముంబై, జైపూర్, ఢిల్లీ వేదికగా మూడు పార్టీల మధ్య హైపిచ్ లో హైడ్రామా కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. శివసేనకు ఈ సాయంత్రం 7:30 గంటల వరకు గడువు విధించిన నేపథ్యంలో.. శివసేనలో ఆందోళన మొదలైంది. 54 మంది పార్టీ శాసన సభ్యులతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అగ్ర నాయకత్వం సమావేశమైనప్పటికీ.. ఏదీ తేల్చలేదు. తన మిత్రపక్షం కాంగ్రెస్ తుది నిర్ణయం కోసం ఎన్సీపీ ఎదురు చూస్తోంది.
కాంగ్రెస్ మెడకు మహారాష్ట్ర ఉచ్చు: అసమ్మతి భగ్గు: వచ్చే ఏడాదే మధ్యంతర ఎన్నికలు: సీనియర్
సాయంత్రం తేల్చనున్న సోనియా..
కాంగ్రెస్ తన నిర్ణయాన్ని సాయంత్రానికి వాయిదా వేసుకుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో బ్యునావిస్టా రిసార్ట్ లో సమావేశమైన మహారాష్ట్ర కాంగ్రెస్ శాసన సభ్యులు ప్రస్తుతం హస్తిన బాట పట్టారు. ఈ సాయంత్రం 4 గంటలకు వారు పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం కానున్నారు. ఆ సమావేశం తరువాతే సోనియా గాంధీ పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గె వెల్లడించారు.
గవర్నర్ వద్దకు ప్రతినిధుల బృందాన్ని పంపించాలంటూ..
ఈ రెండు పరిణామాలు శివసేనను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శివసేన అధినేతగా ఉద్ధవ్ థాక్రే ఎన్సీపీ వైపు చూస్తుండగా.. ఆ పార్టీ మాత్రం కాంగ్రెస్ ఇచ్చే సంకేతాల కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో- ఉద్ధవ్ థాక్రే.. ఈ మధ్యాహ్నం శరద్ పవార్ తో భేటీ అయ్యారు. తన వ్యక్తిగత నివాసం మాతోశ్రీ నుంచి బయలుదేరిన ఆయన నేరుగా శరద్ పవార్ ఉంటోన్న హోటల్ తాజ్ ల్యాండ్స్ కు బయలుదేరి వెళ్లారు. ఆయనతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ వద్దకు వెళ్లాల్సి ఉందని, తనతో పాటు ఎన్సీపీ ప్రతినిధుల బృందాన్ని పంపించాలని ఉద్ధవ్ ఈ సందర్భంగా శరద్ పవార్ ను కోరినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సంకేతాల కోసం..
శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, మిత్రపక్షమైనందున కాంగ్రెస్ నుంచి తుది సంకేతాలను కోసం ఎదురు చూస్తున్నామని ఈ సందర్భంగా శరద్ పవార్ స్పష్టం చేసినట్లు తెలిసింది. భారతీయ జనతాపార్టీకి అధికారాన్ని దూరం చేయడానికి తాము శివసేనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని శరద్ పవార్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని, సానుకూలంగా స్పందిస్తుందనే ఆశ తనకు ఉందని శరద్ పవార్ ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.