సీజే రమణ సలహా వెనుక ? ఆ అనుభవాల వల్లే -మధ్యవర్తిత్వానికి జగన్, కేసీఆర్ ససేమిరా ?
ఏపీ, తెలంగాణ మధ్య సాగుతున్న కృష్ణా, గోదావరి జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకూ ఆమోదయోగ్యంగా ఉండే తీర్పు చెప్పే విషయంలో సీజేఐ ఎన్వీ రమణ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలేంటి ? తెలుగు రాష్ట్రాల్లో గతానుభవాలే ఆయన్ను ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు సీజే రమణ సూచించిన విధంగా మధ్యవర్తిత్వానికి సైతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు.
సీజే రమణ సలహా వెనుక ?
భారత న్యాయవ్యవస్ధలో అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ మధ్య కాలంలో మధ్యవర్తిత్వంపై పదే పదే చర్చకు తావిస్తున్నారు. పలు సందర్భాల్లో న్యాయ పరిష్కారాల కంటే మధ్యవర్తిత్వం ద్వారానే ఎన్నో వాజ్యాలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా తాజాగా సుప్రీంకోర్టు వరకూ వచ్చిన ఓ తెలుగు జంటను కూడా మధ్యవర్తిత్వంతో కలిపారు. ఇప్పుడు తాజాగా ఏపీ-తెలంగాణ జల వివాదాలకు సైతం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కనుగొనాలని సీఎంలు కేసీఆర్, జగన్ కు సలహా ఇచ్చారు. అయితే ఈ సలహా వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. దీంతో సీజే రమణ ఇచ్చిన సలహాపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
చేదు అనుభవాలే కారణమా ?
గతంలో తెలుగు రాష్ట్రాల్లో తనకు ఎదురైన చేదు అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని సీజేఐ ఎన్వీ రమణ ఈ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు కూడా. గతంలో తాను న్యాయవ్యవస్ధలో వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు ఎదురైన అనుభవాలే తాజాగా సీజే రమణ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యాయని ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది. ఇతమిత్థంగా ఏ కారణం చెప్పకపోయినా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎవరో ఒకరి వైపు నిలిచి మరొకరిని బాధపెట్టకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
దీంతో మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం లేదా తిరిగి మరో ధర్మాసనానికి కేసు బదిలీకి సీజే రమణ మొగ్గు చూపుతున్నారు.
ఛీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ లేఖ
గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పనిచేస్తున్న సమయంలో ఏపీలో తమ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు ఏపీ హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులతో కలిసి రమణ ఆయన కుట్ర చేస్తున్నట్లు సీఎం జగన్ ఆరోపించారు. ఇదే అంశంపై ఫిర్యాదు చేస్తూ అప్పటి ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు లేఖ రాయడంతో పాటు దాన్ని బయటపెట్టారు కూడా. ఆ తర్వాత ఈ ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే .. జస్టిస్ రమణకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే అప్పటికే ఈ లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం, పలు బార్ అసోసియేషన్లు, సీనియర్ న్యాయవాదులు వాదోపవాదాలు చేసుకోవడంతో జస్టిస్ రమణకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
సీజే రమణను పట్టించుకోని జగన్
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీజే రమణ తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చారు. అత్యున్నత న్యాయమూర్తి హోదాలో గర్వంగా సొంతగడ్డకు వచ్చిన ఆయనకు తెలంగాణ సర్కార్ హైదరాబాద్ లో అత్యున్నత స్ధాయిలో ఆతిధ్యం ఇచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి సీజే రమణను కలిసి అభినందించారు. ఆయన కేబినెట్ మంత్రులతో పాటు తెలంగాణలో విపక్ష నేతలు సైతం సీజే రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ ఏపీలో మాత్రం పరిస్దితి భిన్నం. ఏపీ టూర్ లో ఆయన తిరుపతి వెళ్తే స్ధానిక ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే అక్కడ సీజే రమణను పలకరించారు. ఏపీ సీఎం జగన్ కానీ, ఆయన కేబినెట్ మంత్రులు కానీ, ఇతర పెద్దలు కానీ సీజే రమణను కలిసి అభినందించలేదు. దీంతో అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
Recommended Video
మధ్యవర్తిత్వం అసాధ్యం ఎందుకంటే ?
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యవర్తిత్వానికి చొరవ చూపాలని సీజే రమణ నిన్న సూచించారు. అయితే గతంలో పలుమార్లు సమావేశాలు పెట్టుకుని, పరస్పరం సహకరించుకున్న జగన్, కేసీఆర్.. ఇప్పుడు కీలక సమస్యకు వచ్చే సరికి మాత్రం తలోదారి అయిపోయారు. దీనికి ఓ ప్రధాన కారణం హుజురాబాద్ ఉపఎన్నిక అన్న చర్చ సాగుతోంది. తెలంగాణ అజెండా అప్రాధాన్యంగా మారిపోయిన హుజురాబాద్ ఉపఎన్నికలో తెలంగాణ వాదంతోనే ఎదిగిన టీఆర్ఎస్ సత్తా చాటాలంటే పొరుగు రాష్ట్రంతో ఏదో ఒక అపరిష్కృత సమస్య ఉండాలి. సరిగ్గా దీన్నే సద్వినియోగం చేసుకుని కేసీఆర్ రాయలసీమ లిఫ్ట్ వివాదాన్ని తెరపైకి తెచ్చారనే విమర్శలు ఉన్నాయి. అలాగని తెలంగాణలో ఇతర పక్షాలు రాయలసీమ లిఫ్ట్ ను సమర్ధించలేవు. దీంతో ఈ వివాదంతో మొత్తం జల వివాదాలను కెలికిన కేసీఆర్ ఇప్పుడు మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాద పరిష్కారానికి చొరవ చూపే అవకాశం లేదు. అదే సమయంలో జగన్ కూడా సీజే రమణ సూచించిన మధ్వవర్తిత్వానికి అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్యవర్తిత్వం ఫలిస్తే కేసీఆర్ తో కుమ్మక్కు అన్న రాజకీయ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.