సాయిబాబాని పూజించడం వల్లే కరువు, శని గుడిలో ప్రవేశిస్తే రేప్లు: స్వరూపానంద
ముంబై: మహారాష్ట్రలో కరువుకు సాయి భక్తులే కారణమని శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లతో సమానంగా సాయిబాబాను కొలవడం వల్లే కరువు వచ్చిందని ఆయన ఆరోపించారు.
షిర్డీ సాయిబాబాను పూజించడం వల్లే మహారాష్ట్రలో కరువు వచ్చిందని, ప్రత్యేకించి షిర్డీ ప్రాంతంలో సాయిబాబాను ఆరాదించారని, అందుకే కరువు, నీటి కొరత ఏర్పడిందని చెప్పారు. శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళలను అనుమతించడం మంచిది కాదని చెప్పారు. భవిష్యత్తులో అత్యాచారాలు జరగవచ్చునన్నారు.
నాలుగు వందల ఏళ్లుగా ఉన్న ఆచారాన్ని కాదని గర్భగుడిలోకి ప్రవేశించాలనుకుంటే మహిళలకే అశుభం కలుగుతుందన్నారు. శని ఒక దుష్టగ్రహమని, సున్నితమైన మనస్తత్వం కలిగిన మహిళలు శని దేవాలయం గర్భగుడిలోకి వెళ్తే అశుభం కలుగుతుందన్నారు. వారిపై నేరాలు పెరిగే ప్రమాదముందన్నారు.
కాగా, స్వరూపానంద సరస్వతి లక్షలాది మంది సాయిబాబా భక్తుల సెంటిమెంటును అగౌరవపర్చారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో కరువు, కాటకాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.