Sri Lanka Adani Row: పవర్ ప్రాజెక్టును అదానీకి ఇచ్చేలా గోటబయ రాజపక్సపై నరేంద్ర మోదీ ఒత్తిడి తెచ్చారా?
శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపు కంపెనీకి ఇచ్చేలా దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ''ఒత్తిడి’’ తెచ్చారని సీలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై వివాదం రాజుకోవడంతో తన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకున్నారు. మరోవైపు గోటాబాయా రాజపక్స కూడా ఈ ఆరోపణలను తిరస్కరించారు. అయితే, తాజాగా ఫెర్డినాండో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఈ వివాదంపై భారత్లోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి.
https://twitter.com/RahulGandhi/status/1535960452387074048
ఈ అంశంపై కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. సీలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మన్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఆయన ట్వీట్ చేశారు. ''పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలనే మోదీ విధానాలు నేడు సరిహద్దులు దాటి శ్రీలంకకు కూడా వెళ్లిపోయాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
https://twitter.com/pbhushan1/status/1535818113400287232
మరోవైపు సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈ వివాదానికి సంబంధించిన వార్తలను షేర్ చేశారు. ఇది అవినీతి కాదా? అని ఆయన ప్రశ్నించారు.
- శ్రీలంక: సమైక్య నిరసనల వెనుక ఎందుకీ విభజన రేఖలు?
- లీటర్ పెట్రోల్ రూ.373, డీజిల్ 329.. ఆందోళనకు దిగిన ప్రజలపై పోలీసుల కాల్పులు
ఆర్థిక సంక్షోభం నడుమ..
శ్రీలంక ఆర్థిక సంక్షోభం నడుమ సతమతమవుతోంది. ఆహార పదార్థాలు, పెట్రోలు-డీజిల్, నిత్యావసరాలు దొరక్క అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.
అయితే, మన్నార్ జిల్లాలోని పవన విద్యుత్ ప్రాజెక్టు టెండర్ను భారత్కు చెందిన అదానీ గ్రూప్కు ఇచ్చేలా శ్రీలంక దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒత్తిడి తెచ్చినట్లు ప్రజా వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి సీఈబీ ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో జూన్ 10న వెల్లడించారు.
మోదీ ఒత్తిడి వల్లే ఈ ప్రాజెక్టును అదానీ గ్రూపుకు ఇస్తున్నట్లు రాజపక్ష తనతో చెప్పారని పార్లమెంటరీ కమిటీ ముందు ఆయన వెల్లడించారు.
''మోదీ చాలా ఒత్తిడి చేశారని రాజపక్స నాతో చెప్పారు’’ అని ఫెర్డినాండో పేర్కొన్నారు.
https://twitter.com/GotabayaR/status/1535607503613964288
అయితే, ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స జూన్ 11న ఒక ట్వీట్ చేశారు.
https://twitter.com/SriLankaTweet/status/1535677804909858817
''మన్నార్ పవన విద్యుత్ ప్రాజెక్టు విషయంలో పార్లమెంటరీ కమిటీ ముందు సీఈబీ ఛైర్మన్ చెప్పిన విషయాలను ఖండిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో మాపై ఎవరి ఒత్తిడీ లేదు’’ అని ఆయన చెప్పారు.
- శ్రీలంక: రాగి శాసనాలలో కనిపించిన తెలుగు భాష-అక్కడ ఒకప్పుడు మాతృభాషగా విలసిల్లిందా?
- శ్రీలంక: ఆ రాతి చిత్రపటం పై విశ్వంలోకి అడుగుపెట్టే సీక్రెట్ కోడ్ ఉందా?
''భావోద్వేగంతో మాట్లాడాను..’’
ఈ విషయంపై వివాదం చెలరేగడంతో తన వ్యాఖ్యలను ఫెర్డినాండో వెనక్కి తీసుకున్నారు. దీనిపై ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కథనం ప్రచురించింది.
''పార్లమెంటరీ కమిటీలోని కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు భావోద్వాగానికి లోనయ్యాను. అందుకే అలా చెప్పాను’’ అని ఆయన వివరణ ఇచ్చినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది.
రాజపక్స ప్రకటన తర్వాత, ఆయన కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
సీఈబీ ఛైర్మన్ వ్యాఖ్యలను మరోసారి ఖండిస్తున్నట్లు దీనిలో పేర్కొన్నారు.
''ప్రస్తుతం శ్రీలంకను ఆర్థిక సంక్షోభం అతలాకుతలం చేస్తోంది. ఈ మెగా పవర్ ప్రాజెక్టు త్వరగా మొదలవ్వాలని అధ్యక్షుడు గోటబయ భావిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడీ లేదు. సరైన నిబంధనలు పాటించే సంస్థలకే ఈ టెండర్లు అప్పగిస్తాం’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
- శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్ప్రెస్ పెర్ల్
- రాజీవ్ గాంధీ చివరి రోజు: 'నా కళ్ల ముందే బాంబు పేలింది'
అదానీకి ఇవ్వడం ఇష్టం లేదా?
విద్యుత్ ప్రాజెక్టుల బిడ్డింగ్ నిబంధనల్లో శ్రీలంక ప్రభుత్వం తాజాగా మార్పులు చేసిన నేపథ్యంలో తాజా వివాదం రాజుకొంది.
అదానీ గ్రూపుకు ఆ ప్రాజెక్టును అప్పగించేలా ఈ మార్పులు చేశారని పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ సమాగీ జన్ బలవెగయా ఆరోపించింది.
అదానీ గ్రూపుకు ప్రాజెక్టును అప్పగించేందుకు వీలయ్యేలా బిడ్డింగ్ విధానాన్ని మార్చేశారని పార్టీ ఎంపీ నలిన్ బండారా వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ ప్రాజెక్టును అదానీ గ్రూపుకు అప్పగించడంపై సీఈబీ కార్మికుల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనంలో తెలిపింది. అదానీ గ్రూపుకు అప్పగిస్తే, తాము దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తామని కార్మికుల సంఘం చెప్పినట్లు పేర్కొంది.
- శ్రీలంకలో పోర్ట్ సిటీ నిర్మిస్తున్న చైనా
- శ్రీలంక వద్దంటోంది.. చైనా తిరిగి తీసుకోనంటోంది - సేంద్రియ ఎరువుల నౌక వివాదం ఏమిటి
''ఆ ప్రాజెక్టును వేగంగా అదానీ గ్రూపుకు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని సీఈబీ ఇంజినీర్ల సంఘం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సరైన వేలం ప్రక్రియను అనుసరించకుండా అదానీ గ్రూపుకు ఆ ప్రాజెక్టు ఇవ్వకూడదని దానిలో పేర్కొంది.
ఈ వివాదంపై ఇటు భారత ప్రభుత్వం, అటు అదానీ గ్రూప్ స్పందించలేదు.
అయితే, గటీవల కాలంలో శ్రీలంకలో కొన్ని ప్రాజెక్టులు అదానీ గ్రూపుకు దక్కాయి. మరోవైపు వ్యూహాత్మకంగా కీలకమైన కొలంబోలోని వెస్టర్న్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్టు కూడా గతేడాది అదానీ గ్రూపుకు దక్కింది.
https://twitter.com/gautam_adani/status/1452948736594771974
గత ఏడాది అక్టోబరులో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ శ్రీలంకలో పర్యటించారు. గోటబయ రాజపక్సతో పెట్టుబడులపై చర్చించారు. మన్నార్, జాఫ్నా, కిలినోచీ లాంటి తీర ప్రాంతాల్లో గౌతమ్ అదానీ పర్యటించారు.
మన్నార్, కిలినోచీలలోని రెండు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై శ్రీలంక ప్రభుత్వం, అదానీ గ్రూపు ఒక ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ద హిందూ పత్రిక ఒక కథనం ప్రచురించింది.
మార్చి 12న ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే, దీని వివరాలు బయటకు వెల్లడించలేదు.
శ్రీలంకకు భారత్ ఆర్థిక సాయం అందిస్తున్న సమయంలోనే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీంతో ఈ ఒప్పందంలో పారదర్శకత కరవైందని శ్రీలంకలో విమర్శలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ను నిర్మూలించవచ్చా?
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే 'వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం?
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)