మగాళ్లు సెక్సువల్ వేధింపులకు గురైతే..! : చెక్ పెట్టనున్న యూజీసీ
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులనేవి ఆడవాళ్లనే కాదు, మగాళ్లనూ వేధించే సమస్యే. విద్యాసంస్థల్లో, పని ప్రదేశాల్లో మగాళ్లపై లైంగిక దాడులు జరిగినా..! పరువు సమస్యతో బయటకిరాని ఉదంతాలు చాలానే ఉండుంటాయి. అదీగాక లైంగిక వేధింపులకు సంబంధించి పురుషులకంటూ ప్రత్యేక చట్టాలేవి లేకపోవడం కూడా ఈ సమస్యను బయటపెట్టడంలో పురుషులు వెనకడుగు వేసేలా చేస్తున్నాయి.
దీనికి పరిష్కారంగా.. పురుషుల కోసం ఇప్పుడు సరికొత్త మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకురానుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ). ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థల్లో పురుషులెవరైనా లైంగిక వేధింపులకు గురైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించి యూజీసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం.. లైంగిక వేధింపులకు గురైన పురుషులెవరైనా సరే ఘటన జరిగిన మూడు నెలల్లోగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. లేనిపక్షంలో బాధితుడి తరుపున బంధువులు, స్నేహితులు కూడా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
అయితే.. ఘటన తర్వాత ఒకవేళ బాధితుడు అనారోగ్యం బారిన గనుక పడితే మూడు నెలల తర్వాత కూడా ఫిర్యాదును స్వీకరించేలా మార్గదర్శకాలు జారీ చేసింది యూజీసీ. కాగా, ఈ ఫిర్యాదులపై కొన్ని ప్రత్యేక కమిటీలు మూడు నెలల్లోగా విచారణ జరిపి నివేదికను సమర్పిస్తాయి.
కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా బాధితుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డవారిని వర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఒకవేళ అధ్యాపకులే అలాంటి చర్యలకు పాల్పడితే సర్వీసు నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తప్పనిసరి కానున్నాయి.
ఆడవాళ్లు పురుషులను వేధిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలోనే యూజీసీ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, 2007లో తొలిసారిగా సెక్సువల్ వేధింపులపై ఇద్దరు పురుషులు ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఫిర్యాదు చేయగా, రామ్ జాస్ కళాశాలలో ఓ మహిళా అధ్యాపకురాలు తమను లైంగికంగా వేధిస్తోందంటూ ఇద్దరు విద్యార్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో యూజీసీ ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించినట్టుగా సమాచారం.