బీఆర్ఎస్ ప్రకటనకు రంగం సిద్దం :కేటీఆర్ - హరీష్ కు కీలక బాధ్యతలు..!!
తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారతీయ రాష్ట్ర సమితి మారనుంది. మరి కొద్ది సేపట్లో చోటు చేసుకొనే ఈ అరుదైన ఘట్టానికి జాతీయ నేతలు తరలి వచ్చారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. సరిగ్గా 1.19 గంటలకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా సంతకం చేయనున్నారు. ఇక, బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించేందుకు కర్ణాటక - తమిళనాడుకు చెందిన పలువురు నేతలు ప్రగతి భవన్ కు చేరుకున్నారు.
ప్రగతి భవన్ లో ముఖ్య నేతలు
ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో భాగంగా పలు పార్టీల అధినేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వారితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. వారికి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఇచ్చారు. తమిళనాడు నుంచి విదుతాలై చిరుతైగల్ కట్చె (విసికె)పార్టీ అధినేత చిదంబరం పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ దళిత నేత తిరుమావళవన్ తో పాటుగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.
అటు పార్టీకి చెందిన 283 మంది నేతలు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వారంతా కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు.
పార్టీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
సీఎం కేసీఆర్ తో పాటుగా కుమార స్వామి..తమిళనాడు నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇక, మంత్రులు కేటీఆర్ - హరీష్ జాతీయ పార్టీ వేళ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ తీర్మానం మొదలు నేతల సమన్వయం - పార్టీ ప్రకటన తరువాత కీలక బాధ్యతల స్వీకరణకు సిద్దమయ్యారు. కేటీఆర్ - హరీష్ ఇద్దరూ కలిసి ఒకే కారులో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యకవర్గం సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అందులో తన జాతీయ పార్టీ లక్ష్యాలను వెల్లడించనున్నారు. జాతీయ స్థాయిలో ఇక పోటీ బీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా ఉండనుందని ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.
1.19 గంటలకు జాతీయ పార్టీ అధినేతగా..
పార్టీ ప్రకటన సమయాన భారీ స్థాయిలో బాణసంచా - పండుగ వాతావరణం కనిపించేలా అన్ని ఏర్పాట్లు చేసారు. టీఆర్ఎస్ స్థానంలో పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేమ్ బోర్డులు సిద్దమయ్యాయి. ఇదే సమావేశంలో టీఆర్ఎస్ సాధించిన విజయాలను సీఎం కేసీఆర్ వివరిస్తూనే.. బీఆర్ఎస్ లక్ష్యాలను స్పష్టం చేయనున్నారు.
ఇక, ఈ సమయంలో పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ పార్టీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తిరిగి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో..ఇప్పుడు కేసీఆర్ కు పలువురు నేతలు జాతీయ ప్రకటన వేళ మద్దతుగా సందేశాలు పంపిస్తున్నారు. కేసీఆర్ పార్టీ సమావేశంలో చేయనున్న ప్రసంగం పైన ఆసక్తి నెలకొని ఉంది.