ఈటలపై చర్యలు తప్పవా - నేడు అసెంబ్లీ వేదికగా..!!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ఈ రోజు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అందులో భాగంగా.. ఈ రోజు సభలో కీలక అంశాల పైన నిర్ణయాలు.. బిల్లులతో పాటు ఈటల అంశంలో స్పీకర్ నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొని ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ రోజున బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం పైన పార్టీ ఎమ్మెల్యేగా ఈటల స్పందించారు. స్పీకర్ పైన వ్యాఖ్యలు చేసారు. వీటిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

ఈటల పై చర్యలు తప్పవా
ఆ వ్యాఖ్యలపై స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఈటలకు సూచించారు. లేకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేసారు. ఇదే సమయంలో స్పందించిన ఈటల తనను సీఎం కేసీఆర్ సభలో చూడకూడదని అనుకుంటున్నారట అంటూ వ్యాఖ్యానించారు. తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. దీంతో..ఈటల కు స్పీకర్ నోటీసులు ఇస్తారంటూ ప్రచారం సాగింది. ఈ రోజు సభలో ప్రభుత్వంలోని మంత్రులు..టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన చర్యలకు డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో స్పీకర్ ఈ వ్యవహారం పైన ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తారా లేక, నేరుగా చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది.

సభలో కీలక బిల్లులు
ఇక..ఈ రోజు సభలో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. సభ ప్రారంభమైన తరువాత దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతి రావు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. ఆ తర్వాత కేంద్ర విద్యుత్ చట్టంపై లఘు చర్చ చేపట్టనున్నారు. కేంద్రం కొద్ది రోజుల క్రితం ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి బకాయి ఉన్న విద్యుత్ బకాయిలను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని పైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ నుంచి తమకే బకాయిలు రావాల్సి ఉందని చెబుతోంది. ఈ అంశాలను ఈ రోజు సభలో ప్రస్తావించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, సభలో జీఎస్టీ సవరణ బిల్లుతో పాటుగా మంత్రి కేటీఆర్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించనున్నారు.

కేంద్రం తీరు పైన సభా వేదికగా
అదే విధంగా మంత్రి హరీష్ రావు ఉద్యోగుల వయో పరిమితి సవరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ విశ్వవిద్యాలయం బిల్లు..మంత్రి సబితా ఇంద్రారెడ్డి విశ్వ విద్యాలయ సాధారణ నియామకాల బిల్లును సభలో ప్రవేశ పెడతారు. మంత్రి పువ్వాడ అజయ్ తెలంగాణ రాష్ట్ర వాహన పన్నుల సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. నిజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా లీజ్ సవరణ బిల్లును మంత్రి కేటీఆర్ సభలో ప్రతిపాదిస్తారు. ఈ రోజు..రేపు కేంద్రం తెలంగాణ తో వ్యవహరిస్తున్న తీరు పైన చర్చ కోసం టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీరును సభ ద్వారానే ఎండ గట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఈ రెండు రోజుల సభ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications