దుబ్బాక ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్ గెలుపు, మరో సర్వే బీజేపీకి పట్టం
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం సాయంత్రం 6 గంటలవరకు సాగిన పోలింగ్ కొనసాగగా.. దుబ్బాక ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేసి చైతన్యాన్ని చాటుకున్నారు. దీంతో పోలింగ్ ముగిసే సమయానికి 82 శాతం పోలింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
దుబ్బాకలో టీఆర్ఎస్ విజయభేరీ..
దుబ్బాక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండగా.. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్(నాగన్న) సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ విజయభేరి మోగిస్తుందని వెల్లడించింది. 51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానం లభించగా.. 33-36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్కు రెండో స్థానం, 8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి మూడో స్థానం లభించింది.
బీజేపీకి పట్టం కట్టిన దుబ్బాక ప్రజలు
మరో సంస్థ పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం బీజేపీ విజయం సాధించబోతున్నట్లు స్పష్టం చేసింది. 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రానున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్కు రెండోస్థానం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 13 శాతం ఓట్లు రానున్నట్లు ఈ సంస్థ స్పష్టం చేసింది.
నవంబర్ 10న దుబ్బాక ఫలితాలు
కాగా, దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత పోటీ చేయగా, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి.
బీజేపీ గెలుపు ఖాయమంటూ బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయమైందని అన్నారు. టీఆర్ఎస్ అనేక అరాచకాలు పాల్పడిందని, డబ్బులు విచ్చలవిడిగా పంచిందని ఆరోపించారు. అయినా, దుబ్బాక ప్రజలు బీజేపీకి అండగా నిలిచారన్నారు. భారీ ఎత్తున ఓట్లు వేసిన దుబ్బాక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా దుబ్బాకలో తమదే గెలుపంటే చెబుతున్నారు.