అందుకే హైదరాబాద్ ఇమేజ్ తగ్గుతోంది: పువ్వాడ
హైదరాబాద్: కొందరు నేతల వ్యాఖ్యల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతోందని పువ్వాడ విమర్శించారు. శాసన సభలో మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యల పైన పువ్వాడ అజయ్ తీవ్రంగా స్పందించారు. ఫౌల్ట్రీ ఫారాల్లో కాలేజీలు అంటూ శ్రీహరి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను అజయం తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యల వల్లనే ఇమేజ్ దెబ్బతింటోందన్నారు. నిబంధనలు పాటించని కాలేజీల పైన చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు.
వేలాదిమంది విద్యకు దూరమవుతున్నారు: కిషన్ రెడ్డి
ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించక పోవడం వల్ల వేలాది మంది విద్యకు దూరమవుతున్నారని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్స్ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కాగా, ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయంలో ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సభ నుండి వాకౌట్ చేశాయి.
ఈ సందర్భంగా మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ వారు కూడా అవినీతి పైన మాట్లాడుతున్నారని, వారే అవినీతి పైన మాట్లాడితే తాము ఇక దేని పైన మాట్లాడాలని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకానికి తూట్లు పొడిచే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు పడిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. రీయింబర్సుమెంట్స్ ఇచ్చాక కూడా ఆరోపణలు సరికాదన్నారు.
మౌలిక వసతులు అధ్వాన్నం: అక్బరుద్దీన్
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అవకతవకలుగా ఉన్నాయని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. చాలా కళాశాలల్లో మౌలిక వసతులు సరిగా లేవన్నారు. అర్హతలేని ఉపాధ్యాయులు కొనసాగుతున్నారని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు పెట్టి ఉచిత విద్య అందించాలన్నారు.