హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
హైదరాబాద్ నగరంలో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం చేయనున్నట్లు లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్ ని
హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరానికి అంతర్జాతీయ సంస్థలు వరుస కడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం చేయనున్నట్లు లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్ ని అందించనున్నట్లు తెలిపింది.
శాండోస్ క్యాపబిలిటీ సెంటర్తో 1800 మందికి ఉపాధి
ఈ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, ఆ తర్వాత దశలవారీగా వీరి సంఖ్యను 1800 మందికి పెంచనున్నట్లు సంస్థ పేర్కొంది. అంతేగాక, జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబోరేటరీని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో సమావేశమైన శాండోస్ కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్ నోర్ ప్రతినిధి బృందం వెల్లడించింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్న కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్లో విస్తరించాలంటూ శాండోస్కు కేటీఆర్ వినతి
హైదరాబాద్ ఫార్మాసిటీలో తయారీ కేంద్రాని కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ప్రతినిధులను కేటీఆర్ కోరారు. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న కేటీఆర్.. ఈ రంగంలో అభివృద్ధి సాధించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలోనే ఇప్పటికే ప్రపంచ దిగ్గజ సంస్థ నోవార్టిస్ తన రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో కలిగి ఉందని, ఇదే స్థాయిలో శాండోస్ కంపెనీ కూడా హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను విస్తరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ల్యాబోరేటరీ చేస్తామన్న శాండోస్
ఈ సందర్భంగా శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. తమ సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి లాబోరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.హైదరాబాద్ నగరంలో ఉన్న లైఫ్ సైన్సెస్ అనుకూల అంశాలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది.
కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపిన శాండోస్ ప్రతినిధులు
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని, ఆ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపడుతున్న భవిష్యత్తు ప్రణాళికల పైన కంపెనీ ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ ఆ వివరాలు అందజేశారు. తమ సంస్థ వెయ్యికిపైగా మాలిక్యూల్స్ని కలిగివుందని, దాదాపు పది బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోందని శాండోస్ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ విస్తరణ తమ భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాలకు భవిష్యత్తు ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన శాండోస్ బృందం మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.