ఈ విషయాన్ని మీ ప్రధానికి చెప్పండి; కేంద్రమంత్రికి సలహా ఇచ్చిన కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. పెట్రో ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా, కేంద్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ట్విట్టర్ వేదికగా స్పందించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలంగాణ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుందని, 2014 నుండి 2021 వరకు 56 వేల 20 కోట్ల రూపాయలు వ్యాట్ గా వసూలు చేసిందని హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి పెట్రో ఉత్పత్తులపై తమ ప్రభుత్వం ఎటువంటి వ్యాట్ పెంచలేదంటూ వెల్లడించారు. అలాంటప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం పెట్రో పన్నులను పెంచింది అనే మాట ఎలా ఉత్పన్నం అవుతుందని హర్దీప్ సింగ్ పూరిని ప్రశ్నించారు.
ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలను ప్రస్తావించిన మంత్రి కేటీఆర్ పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రిని సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 2014లో క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ రేటు 70 రూపాయలు ఉందని, ఇప్పుడు కూడా అదే ధరకు క్రూడ్ ఆయిల్ దొరుకుతుందని, కానీ పెట్రోల్ రేటు లీటరుకు 120 రూపాయలు పైగా ఎలా పెరిగిందో చెప్పాలంటూ కేంద్ర మంత్రిని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ పెరుగుదలకు నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ అయిన ఎన్పీయే గవర్నమెంట్ అయిన మీ ప్రభుత్వం కారణం కాదా అంటూ ప్రశ్నించారు.
కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్ లు కారణం కాదా అంటూ మంత్రి కేటీఆర్ నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు సెస్ ల రూపంలో ప్రజలనుంచి గుంజారు... ఇది వాస్తవం కాదా అంటూ కేటీఆర్ నిలదీశారు. ఇతర రాష్ట్రాలకు నీతులు చెప్పే బదులు కేంద్రం పెంచిన సెస్ లను పూర్తిగా రద్దు చేస్తే భారతదేశంలోని ప్రజలకు 70 రూపాయలకు పెట్రోలు, 60 రూపాయలకు డీజిల్ అందే వీలుంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఇదే విషయాన్ని మీ ప్రధానమంత్రికి చెబితే మంచిదంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి సలహా ఇచ్చారు కేటీఆర్.