పారిపోతూ భవనంపై నుంచి పడి మరణించిన దొంగ
హైదరాబాద్: మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్కు ప్రయత్నించిన ఓ యువకుడు స్థానికులు వెంటాడడంతో పారిపోవడానికి ప్రయత్నించి ఓ భవనంపై నుంచి దూకి గాయపడ్డాడు. ఆ తర్వాత అతను మరణించాడు. ఈ సంఘటన హైదరాబాదులోని లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ప్రశాంత్నగర్ పిండిగిర్ని సమీపంలో నుంచి ఓ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలోని గొలుసును తెంపడానికి ప్రయత్నించాడు.
అప్రమత్తమైన ఆమె కేకలు వేయడంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి పక్కన ఉన్న మరోభవనంపైకి దూకుతుండగా జారి కిందపడ్డాడు.
స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలకు గురైన అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు.