చంద్రబాబుకు శుభవార్త చెప్పిన గంటా శ్రీనివాస్..!!
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు.. పార్టీని వీడబోతోన్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో ఇదివరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. టీడీపీలో కలకలం రేపాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైనప్పటి నుంచీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తోన్న ఈ విశాఖ నార్త్ ఎమ్మెల్యే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నారనే వార్తలు ప్రకంపనలు పుట్టించాయి.
చాలాకాలం పాటు..
2019 నాటి ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీకి చెందిన కన్నపరాజుపై 2,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్రం మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం వీచినప్పటికీ- దాన్ని తట్టుకున్న 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆయనా ఒకరు. గెలిచిన తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ పరంగా ఎలాంటి సమీక్షా సమావేశాలకు గానీ, కార్యక్రమాలకు గానీ హాజరు కాలేదు.
టీడీపీలోనూ అనుమానాలు..
పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు విశాఖపట్నానికి వచ్చినప్పటికీ ఆయనను కలిసే కనీస ప్రయత్నం కూడా చేయలేదు గంటా శ్రీనివాస్. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో తన పదవికి సైతం రాజీనామా చేశారు. దాన్ని స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. ఆయా పరిణామాల మధ్య టీడీపీకి గంటా శ్రీనివాస్ గుడ్బై చెప్పడం ఖాయమేనంటూ మొదటి నుంచీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ- అవి వాస్తవ రూపం దాల్చుతాయని, డిసెంబర్ 1వ తేదీన వైఎస్ఆర్సీపీలో చేరబోతోన్నారనే వార్తలు వెల్లువెత్తాయి. దీన్ని ఆయన తోసిపుచ్చలేదు.
గట్టి పట్టు ఉన్న నేత కావడంతో..
గంటా శ్రీనివాస్.. పార్టీని వీడబోతోండటం ప్రధానంగా టీడీపీలో కలకలం రేపుతోంది. ఉత్తరాంధ్రపై గట్టిపట్టు ఉందాయనకు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం అదనపు బలం. ఏ పార్టీ నుంచి అయినా, ఏ స్థానం నుంచి పోటీకి దిగినా అపజయాన్ని మాత్రం చవి చూడలేదు. పోటీ చేసిన ప్రతీసారీ గెలుస్తూ వస్తోన్నారు. అలాంటి నాయకుడు టీడీపీని వీడబోతోన్నారనే వార్తలతో టీడీపీ నాయకత్వం అప్రమత్తమైంది. ఆయనను బుజ్జగించింది.
వైఖరేంటో బయటపెట్టిన గంటా..
తాజాగా తన వైఖరేమిటనేది ఆయన బయటపెట్టారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా గంటా శ్రీనివాస్ తన మౌనాన్ని వీడారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఆయనను మహనీయుడిగా అభివర్ణించారు. రాష్ట్ర రాజకీయాలను ఎన్టీఆర్ మలుపు తిప్పారని, ఆయన చూపిన బాటలోనే అన్ని ప్రభుత్వాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు.
ఇకపై క్రియాశీలకంగా..
తాను పార్టీకి మారబోతోన్నానంటూ వచ్చిన వార్తలపై గంటా శ్రీనివాస్ స్పందించారు. తాను టీడీపీని వీడట్లేదని, ఇందులోనే కొనసాగుతాననీ తేల్చి చెప్పారు. రెండు సంవత్సరాలు కోవిడ్ లోనే గడిచిపోయాయని, ఆ తరువాత అనుకోని విధంగా తనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయని వ్యాఖ్యానించారు. అవన్నీ పరిష్కారం అయ్యాయని, ఇకపై తాను మళ్లీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని వివరించారు. ఇప్పటి నుంచి యాక్టివ్ గా ఉండాలనుకుంటున్నానని అన్నారు.