విశాఖలో నాకున్నది అదొక్కటే.. ఆస్తి వివరాలు బయటపెట్టిన విజయసాయి రెడ్డి
ఏపీ రాజకీయంలో రాజధాని రగడ ఉత్కంఠను రేపుతోంది. నేటి కేబినెట్ భేటీతో రాష్ట్ర రాజధాని ఎక్కడన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆలోచనలు,ఇదివరకు చేసిన ప్రకటనల బట్టి చూస్తే.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తోంది. దాదాపు ఆర్నెళ్ల ముందు నుంచే వైసీపీ నేతలంతా విశాఖలో వాలిపోయి భూపందేరం మొదలుపెట్టారని ఆరోపిస్తోంది. అటు వైసీపీ మాత్రం టీడీపీ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ చేస్తోన్న ఈ ఆరోపణలపై పరోక్షంగా స్పందించారు.
ఒకే ఒక్క ట్రిపుల్ బెడ్రూమ్..
విశాఖపట్నంలో తనకు ఒకే ఒక్క ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందని,అది తప్ప మరో ఆస్తి లేదని తెలిపారు. తనకే కాదు తన బంధువులకు గానీ,కుటుంబ సభ్యులకు గానీ విశాఖలో ఎలాంటి ఆస్తులు లేవన్నారు. అలాగే వ్యాపారాలు, వ్యాపార భాగస్వామ్యాలు లేనే లేవన్నారు. విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడారు.
అలాంటి వారిపై క్రిమినల్ కేసులు..
తన పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు విశాఖ అధికారుల వద్ద వివాదాస్పద భూముల గురించి ఆరా తీస్తున్నట్టు తెలిసిందన్నారు. తన పేరు వాడుకుని అలాంటి డీలింగ్స్ చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయబోతున్న నేపథ్యంలో ఈ నెల 28న నగరానికి వస్తున్న సీఎం జగన్కు ఘనస్వాగతం పలకాలని విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసం విమానాశ్రయం నుండి కైలాసగిరి వరకు, అక్కడినుంచి ఆర్కే బీచ్ వరకు మొత్తం 24కి.మీ పొడవునా నిలుచుని జగన్కు స్వాగతం పలకాలన్నారు.
తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ
రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని విజయసాయి రెడ్డి అన్నారు. తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా జగన్కు ఉందన్నారు. గురువారం తిరుపతి నగరంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
నేడే కేబినెట్ భేటీ
ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖకు నేటి కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. రాజధానిపై కీలక నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలోచుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు నేటితో 10వ రోజుకు చేరుకున్నాయి.నేటి కేబినెట్ భేటీలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా ఆమోదముద్ర పడితే ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.