కాళ్లనొప్పులు: షర్మిల, బాబు రోటీన్ స్పీచ్లు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నార చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల పోటాపోటీగా పాదయాత్రలు చేస్తున్నారు. పరస్పరం దూషించుకుంటున్నారు. పనిలో పనిగా ఇరువురు కూడా కాంగ్రెసు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడి పాదయాత్ర నిరుడు అక్టోబర్ 2వ తేదీ నుంచి మధ్యలో రెండు, మూడు రోజుల అంతరాయాలతో కొనసాగుతుండగా, షర్మిల పాదయాత్ర డిసెంబర్ 15వ తేదీన ఆగిపోయి మళ్లీ బుధవారం ప్రారంభమైంది.
చంద్రబాబు కాలి బొటనవేలి నొప్పితో బాధపడుతున్నారు. అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహాల ఇచ్చినా పట్టించుకోకుండా మొండిగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభమైన ఆయన పాదయాత్ర గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. షర్మిల మోకాలి చిప్పకు శస్త్ర చికిత్స చేయించుకుని మళ్లీ పాదయాత్రకు ఉపక్రమించారు. బుధవారంనాటి పాదయాత్ర కారణంగా ఆమె మోకాలి నొప్పి తీవ్రమైనట్లు చెబుతున్నారు.
పాదయాత్రలు చేస్తూ ఇరువురు కూడా ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలపై చంద్రబాబు హామీలు ఇస్తుండగా, తన సోదరుడు వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను తుచ తప్పకుండా అమలు చేస్తాడని షర్మిల హామీ ఇస్తున్నారు. ఈ హామీలను ప్రజలు ఎంత వరకు నమ్ముతున్నారో తెలియడం లేదు.
కానీ, చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అవినీతిని ప్రధానం చేసుకుని ఆరోపణాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వైయస్ జగన్ దోచుకుని తిన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. జగన్ అవినీతిపై చంద్రబాబు ఆరోపణలు దాదాపు అన్ని ప్రసంగాల్లోనూ ఒకే రకంగా ఉంటున్నాయి. పిల్ల కాంగ్రెసు అంటూ వైయస్సార్ కాంగ్రెసుకు పేరు పెట్టి ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు.
కాగా, చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయి జగన్ను జైలు పాలు చేశారని షర్మిల పదే పదే విమర్శిస్తున్నారు. జైలు నుంచి బయటకు రాకుండా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై కాంగ్రెసు కేసులు పెట్టడం లేదని, అందుకు ప్రతిఫలంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించడం లేదని షర్మిల విమర్సిస్తున్నారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించబోరని ఆమె చెబుతున్నారు.
చంద్రబాబు గానీ షర్మిల గానీ ఎంత సేపు ప్రసగించినా, ఎన్ని చోట్ల ప్రసంగించినా వారి ప్రసంగాల సారాంశం మాత్రం అదే. ఒక రకంగా రోటీన్ స్పీచ్లతో వారు ముందుకు సాగుతున్నారు. ఈ రోటీన్ స్పీచ్ల వల్ల ప్రజలకు విసుగు కలగదా అనే ప్రశ్న వస్తుంది. అయితే, వేర్వేరు చోట్ల మాట్లాడుతున్నందున ఎప్పటికప్పుడు అక్కడి ప్రజలకు అవి కొత్తగానే ఉంటాయని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ, టీవీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా ఆ ప్రసంగాలను వినే అవకాశం కలుగుతోంది. ఏమైనా, వారి ప్రసంగాలు తమ తమ పార్టీలకు ఎంత మేలు చేస్తాయనేది ఇప్పుడే తెలిసే అవకాశం లేదు. కానీ పార్టీల కార్యకర్తలకు మాత్రం ఆ నాయకుల పాదయాత్రలు కాస్తా ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.