ఆ..బ్రహ్మాండాన్నివీళ్లే అందుకోవచ్చుగా?
మన తెలుగు సినిమాలు కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఆడితే హిట్ అంటాం. సూపర్ కలెక్షన్ లతో ఆడితో సూపర్ హిట్ అంటా. ఇదే సినిమా దేశవ్యాప్తంగా ఉన్నమార్కెట్(బాలీవుడ్) లో భారీ విజయం సాధిస్తే..బ్రహ్మాండమైన హిట్ అంటా. ఈ మధ్య మన తెలుగు సినిమాలు చాలానే ఇలాంటి బ్రహ్మాండమైన విజయాలు సాధించాయి. కాక పోతే ఆ బ్రహ్మాండం మన తెలుగు దర్శకులకు, హీరోలకు దక్కలేదు. కారణం.....మన దగ్గర హిట్టయిన సినిమాల కథలను ఎగరేసుకెళ్లి బాలీవుడ్ హీరోలు నటించి లబ్ది పొందుతున్నారు.
చిరంజీవి.. ఆజ్ కా గుండా రాజ్, ప్రతి బంధ్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగార్జున నటించిన సినిమాలు ఉత్తరాది వాళ్లకి నచ్చాయి. వెంకటేష్ కూడా హిందీలో నటించారు. ఆ తరువాత ఎవరూ అటు వైపు చూడలేదు. యువ కథానాయకుడు రాణా మాత్రమే 'దమ్ మారో దమ్" చిత్రం ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, రామ్..వీళ్లంతా బాలీవుడ్ లో రాణించే సత్తా ఉన్నవారే. అయితే ఆ మేరకు ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు.
మన హీరోలు తమ చిత్రాల్ని బహు బాషా చిత్రాలుగా మార్చు కోవచ్చు. మహేష్ బాబు ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ ఇదే కథను అభిషేక్ బచ్చన్ తో చేస్తున్నారు. అలా చేయకుండా మహేష్ బాబుతోనే హిందీ వెర్షన్ ప్లాన్ చేస్తే బాగుండేదనే వాదన అభిమానుల నుంచి వినిపిస్తోంది. రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథానాయకుడి కోసం గాలింపు జరుగుతోంది. అయితే తెలుగులో పర్ ఫెక్ట్ గా నటించిన రామ్ చరణ్ తోనే బాలీవుడ్ వెర్షెన్ డిజైన్ చేస్తే పోయేదేముంది? అని వాదించే వారూ లేక పోలేదు.
మన వాళ్లు అక్కడి వారికి పెద్దగా పరిచయం లేదుకాబట్టి దెబ్బతినే అవకాశం ఉందనే అనుమానాలు రావచ్చు. కానీ ఎప్పడు అలా కాదు కదా... తినగ తినగ వేము తియ్యనుండు అన్న చందంగా మన వాళ్ల సినిమాలు చూడగా చూడగా హిందీ జనాలకు మన మీరోలు నచ్చుతారేమో? రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు అక్కడ తమ మార్కెట్ ను విస్తరించుకోలేదా.....?