డెంగ్యూ పీడనలో ప్రకాశం: వరుస కరువు ప్లస్ విష జ్వరాలు
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాపై విష జ్వరాలు విరుచుకు పడ్డాయి. డెంగ్యూ జ్వరం క్రమంగా విజృంభిస్తున్నదని ప్రజలు చెప్తున్నారు.
అమరావతి: ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాపై విష జ్వరాలు విరుచుకు పడ్డాయి. డెంగ్యూ జ్వరం క్రమంగా విజృంభిస్తున్నదని ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారమే 250 మంది డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు.
ఇక ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న వారు ఇంకా ఎక్కువగా ఉంటున్నది. మూడేళ్లలో ఈ ఏడాదే దారుణ పరిస్థితి నెలకొన్నదని జిల్లా వాసులు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రి జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ప్రత్యేకించి జ్వరం వచ్చే రోగుల కోసం 30 పడకలతో ప్రత్యేకంగా అందులో ఓ వార్డు ఉంది. మామూలు రోజుల్లో పది బెడ్లు కూడా నిండవు. ప్రస్తుతం విషజ్వర బాధితులతో నిండిపోయి ఆస్పత్రే కిటకిటలాడుతోంది.
ఇక పిల్లల వార్డులో దాదాపు 90 మంది ఉంటే వీరిలోనూ అత్యధికులు జ్వరంతో తల్లడిల్లుతున్న వారే. మరోవైపు... ఒంగోలులోనే ఓ ప్రముఖ ఆస్పత్రికి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న 11 నెలల చిన్నారితో వచ్చింది ఓ తల్లి. త్వరగా డాక్టర్ను కలుద్దామంటే అంతకంటే ముందు మరో 53 మంది ఇలాంటి కేసులతో వరుసలో ఉన్నారు. ఉదయం 10 గంటలకు చంటిబిడ్డను తీసుకొస్తే... వారి వంతు వచ్చి, డాక్టర్ చూసి, పరీక్షలు చేసి... చికిత్స ప్రారంభించడానికి ఆరు గంటలకుపైగా సమయం పడుతున్నది.
మండల స్థాయి ఆసుపత్రుల్లోనూ రద్దీ
జిల్లా కేంద్రంలోనే కాదు.. మండలస్థాయి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి! వర్షాకాలం రాకతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం జిల్లాపై ఈ సీజన్లో విష జ్వరాలు ముప్పేట దాడి చేశాయి. 2015లో 164 డెంగ్యూ కేసుల నమోదైతే, గత ఏడాది 174, ఈ ఏడాది ఏకంగా 250 కేసులు నమోదయ్యాయి. మలేరియా, టైఫాయిడ్ కేసులైతే వందల సంఖ్యలోనే ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైనవే! ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే వీటికి పదింతల సంఖ్యలో రోగులు ఉన్నట్లు తెలుస్తున్నది. కేవలం ఒంగోలు నగరంలోనే వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు 400 మంది ఇన్పేషెంట్లు ఉన్నట్లు సమాచారం.
50 మండలాల్లో డెంగ్యూ కేసులు నమోదు
జిల్లాలోని 56 మండలాలకు దాదాపు 50 మండలాల్లో డెంగ్యూ జ్వరం కేసులు నమోదయ్యాయి. తాళ్ళూరు, ముండ్లమూరు, దర్శి, దొనకొండ, చీమకుర్తి, అద్దంకి, పుల్లలచెరువు, పి.సి.పల్లి మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ సీజన్లో జిల్లాలో 200లకు పైగా గ్రామాల్లో వ్యాధుల తీవ్రత అధికంగా ఉండగా... జిల్లా మొత్తంగా ఇంచుమించు లక్షకు పైగా కుటుంబాలు విష జ్వరాల బారిన పడ్డాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో 25వేల మందికిపైగా, ప్రైవేట్ వైద్యశాలల్లో సుమారు 75వేలకుపైగా చికిత్స చేయించుకున్నట్లు సమాచారం.
ఒంగోలులోని రిమ్స్లో రోజూ 1800 వరకు ఔట్ పేషంట్ రోగులు చికిత్స పొందుతున్నారు. అందులో 500 వరకు జనరల్ మెడిసిన్ కేసులు ఉంటుండగా వాటిలో సగం మంది జ్వరపీడితులే. అలాగే ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు నిత్యం 25నుంచి 100 మంది వరకూ జ్వర పీడితులు వస్తున్నారు. బెడ్లు ఖాళీ లేక రోగులకు తాత్కాలికంగా మందులు ఇచ్చి పంపేస్తున్నారు. పరీక్షల కోసం మళ్లీ రావాలని చెప్తున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు..
కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అసలే జిల్లాను రెండేళ్లుగా కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. దీనికి తోడు వ్యాధులకు చికిత్స చేయించుకోవడానికి భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. విష జ్వరాలతో జిల్లాలో ఇప్పటి వరకూ 53 మంది చనిపోయారు. వీరిలో ఐదుగురు ఆదివారం చనిపోయారు. తాళ్ళూరు, చీమకుర్తి, కొండపి, ముండ్లమూరు, పుల్లలచెరువు, దర్శి, అద్దంకి, నాగులుప్పలపాడు మండలాల్లోనే ఈ మరణాలు చోటుచేసుకున్నాయి.
వీరంతా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిన వారే. డెంగీ వల్లే వీరు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్తుండగా అధికారికంగా తాము గుర్తించలేమని జిల్లా వైద్యాధికారులు అంటున్నారు.అయితే వ్యాధుల వ్యాప్తికి పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే ప్రధాన కారణమవుతున్నా అధికారులు సీరియస్గా పట్టించుకోవడం లేదు. గత నెల రెండో వారం నుంచి జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురిసి చెరువులు, కాలువలు, వాగుల్లో కొద్దిగా నీరు చేరింది. కొన్ని చోట్ల నీటి కొరతతో బురద నీటినే ప్రజలు వాడుకోక తప్పడం లేదు. పలు గ్రామాలకు కలుషిత నీరు సరఫరా అవుతున్నా, కొళాయిల్లో మురుగునీరు వస్తున్నా క్లోరినేషన్పై శ్రద్ధ కరువైంది.
లక్షల రూపాయలు వదిలిస్తున్న విష జ్వరాలు
తమ ఇంటిలో తొమ్మిది సభ్యులకూ విషజ్వరాలు వచ్చాయని తాళ్లూరు మండలం లక్కవరం వాసి చింతా అంజలి తెలిపారు. తమ వద్ద డబ్బులు లేకపోయినా అప్పులు చేసి నయం చేయించుకున్నామని, వైద్యానికి మొత్తం రూ.4లక్షలు ఖర్చయిందని వాపోయారు. బేల్దారి పనులకు వస్తామని చెప్పి మేస్ర్తితో మాట్లాడుకుని రూ.2లక్షలు అడ్వాన్సు తీసుకుంటే మిగిలిన డబ్బులు గ్రామంలో అప్పు తెచ్చామని పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు కాళ్లూ, చేతుల నొప్పులతో పనులకు కూడా వెళ్లలేకపోతున్నామని, విష జ్వరాలు తమ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముండ్లమూరు మండలం పోలవరం గ్రామ వాసి పీ రాములు మాట్లాడుతూ తన భార్యతోపాటు, ఇద్దరు కుమారులు విషజ్వరంతో మంచం పట్టారని తెలిపాడు.. వారిని చికిత్స కోసం అద్దంకిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పిస్తే రూ. 40 వేలు ఖర్చయిందన్నాడు. కూలికి వెళ్తేకాని కుటుంబం గడవని తమ కుటుంబానికి ఒక్కసారిగా పెద్ద కష్టం వచ్చిపడిందన్నాడు.