జగన్ స్వయంకృతాపరాధం?: చేజేతులా టీడీపికి కొత్త 'అస్త్రం', వ్యూహం మార్చిన ప్రత్యర్థి?
త్రువును గాంభీర్యంగా ఎదుర్కోవాలే తప్ప.. ప్రత్యర్థి చేతికి కొత్త అస్త్రాలు ఇచ్చి లేని కష్టాలు కొనితెచ్చుకోవద్దు.
అమరావతి: రాజకీయాలకు అధికారం పరమావధే కానీ.. విచక్షణా రహిత పోకడలు చేజేతులా ఆ అవకాశాలను నాశనం చేస్తాయి. శత్రువును గాంభీర్యంగా ఎదుర్కోవాలే తప్ప.. ప్రత్యర్థి చేతికి కొత్త అస్త్రాలు ఇచ్చి లేని కష్టాలు కొనితెచ్చుకోవద్దు.
టీడీపీలో ఓ మర్యాద, గౌరవం లేవు.. అందుకే బయటికి, ఏదో ఫ్లోలో జగన్ అలా.. : శిల్పా మోహన్ రెడ్డి
నంద్యాల రాజకీయంలో వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాజకీయాన్ని వ్యక్తిగత కక్షల స్థాయికి దిగజార్చడం ఆయన పరిణితి ఏపాటిదో పట్టిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిదే అవకాశాన్ని బలంగా వాడుకోవడానికి అటు టీడీపీ సిద్దమవుతోంది. ఇందుకోసం బలమైన వ్యూహ రచనతో జగన్ కు చెక్ పెట్టే 'అస్త్రం' సంధించబోతోంది.
ఉన్మాది నాయకత్వమా?, పరిణతి నాయకత్వమా?:
'చంద్రబాబును ఏం చేసినా పాపం లేదు.. నడిరోడ్డు మీద కాల్చి చంపేసినా తప్పులేదు' అంటూ జగన్ ఆవేశంతో ఊగిపోవడం చేజేతులా టీడీపీకి మరో అస్త్రాన్ని అందించినట్లయింది. జగన్ ఆవేశంతో అన్న ఆ వ్యాఖ్యను టీడీపీ తన ఆలోచన సానబెట్టి.. దాని చుట్టూ ఓ భావజాలపు గూడు అల్లుతోంది.
దాని ఫలితమే 'మీకు ఉన్మాది నాయకత్వం కావాలా? లేక పరిణతి చెందిన చంద్రబాబు నాయకత్వం కావాలా?' అంటూ టీడీపీ నుంచి ప్రశ్న ఉత్పన్నమవడం. ఈ విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగి.. జగన్ ఆలోచనా సరళిని ఎండగట్టాలని టీడీపీ భావిస్తోంది. తద్వారా వైసీపీ మైండ్ సెట్ మీద ప్రజల్లో ప్రతికూల ప్రభావం ఏర్పడేలా చేయాలనేది వారి ప్లాన్.
వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?
రాజకీయ విమర్శలు సహజమే, కానీ!
రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు సహజమే అయినప్పటికీ.. జగన్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విమర్శకు బదులు వ్యక్తిగత ప్రతీకారేచ్చతో జగన్ రగిలిపోతున్నారన్న సంకేతాలే జనంలోకి ఎక్కువగా వెళ్తే అది వైసీపీకి తీరని నష్టం చేస్తుంది. ఈ విషయాన్ని ముందు వెనకా ఆలోచించకుండా ఎన్నికల వేళ జగన్ ఆవేశపడటం మరోసారి ఆయన వ్యూహాత్మక తప్పిదాల వైఖరిని బయటపెట్టింది.
హుందాగా వ్యవహరించి ఉంటే!:
నిజానికి నంద్యాలలో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభకు అనూహ్య స్పందన లభించిందనే చెప్పాలి. ఇంతలా జనాన్ని కూడగట్టి సభను విజయవంతం చేసుకోవడంలో సఫలమైన జగన్.. హుందాగా వ్యవహరించడంలో మాత్రం విఫలమయ్యారు.
సీఎం స్థాయి వ్యక్తిని కాల్చి చంపేసినా తప్పులేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ఉన్మాదం అనే అస్త్రాన్ని అందించాయి. జగన్ పట్ల సానుకూల వైఖరి కలిగి ఉన్నవాళ్లు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఎంతమాత్రం సమర్థించలేని పరిస్థితి. దీన్నిబట్టి జగన్ చేజేతులా తమ అవకాశాలను జటిలం చేసుకునే పరిస్థితిని కల్పించుకుంటారనే చెప్పాలి.
బాబుతో పోలిక తెచ్చి!:
జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సంయమనంతో పోల్చడం ద్వారా ఎన్నికల్లో మైలేజీ పొందాలనేది టీడీపీ ఎత్తుగడ. గతంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న నేతగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ.. చంద్రబాబు సంయమనంతో సాగిపోయారని, కానీ జగన్ మాత్రం ఉన్మాది తరహాలో వ్యవహరిస్తున్నారని టీడీపీ అభిప్రాయపడుతోంది.
ఇదే విషయాన్ని రేపు జనంలోకి తీసుకెళ్లడానికి సిద్దమవుతోంది. అంతేకాదు.. ఇంతటి ఉన్మాదాన్ని ప్రదర్శించే వ్యక్తిని గుడ్డిగా నమ్మితే.. రేప్పొద్దున రాష్ట్రానికి కూడా ఇదే గతి పడుతుందని టీడీపీ జనంలో ప్రచారం చేయనుంది. ఒకవిధంగా జగన్ అంటే క్రిమినల్ మైండ్ సెట్ అనే ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది.
ఎంత మాట్లాడుకున్నా.. ఇది మాత్రం జగన్ చేజేతులా చేసుకున్న స్యయంకృతాపరాధమే అని చెప్పాలి. అయితే జగన్పై టీడీపీ చెప్పే మాటలను జనం విశ్వస్తిస్తారా? అన్నది కూడా చర్చనీయాంశమే. టీడీపీ చెబతున్నట్లుగానే జగన్ ను నంద్యాల ప్రజలు ఉన్మాదిగా భావిస్తారా?.. చంద్రబాబును పరిణతి చెందిన నాయకుడిగా పరిగణిస్తారా? మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.