యూపీఏ నుంచి వైదొలగకూడదని డిఎంకె చీఫ్ కరుణానిధి నిర్ణయం
అయితే పార్టీలోని ఓ వర్గం దీనికి ఒప్పుకోలేదు. కేబినెట్ నుంచి వైదొలిగితే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు అన్నాడిఎంకె సిద్ధంగా ఉందని పేర్కొంది. కరుణకు అళగిరి నచ్చజెప్పారని, ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి నుంచి బయటకొస్తే మరిన్ని సమస్యలొస్తాయని వివరించారని సమాచారం. ఈ అంశంపై ఓ పార్టీ నేతను 2జీ కేసులో జైల్లో ఉన్న కరుణ కూతురు కనిమొళి వద్దకు పంపి ఆమె అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. తన కోసం నిర్ణయాలు తీసుకోవద్దని, కేసును ఎదుర్కొనే ందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పినట్లు సమాచారం. స్కామ్లో డిఎంకె ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజా అరెస్టు, మారన్పై ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం తెలిసిందే. కేంద్రం వైఖరికి నిరసనగా యూపీఏ ప్రభుత్వం నుంచి డిఎంకె వైదొలిగే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి.
కనిమొళికి వాటాలున్న కలైంజర్ టీవీ లావాదేవీలతో 2జీ స్కామ్ను సీబీఐ ముడిపెట్టడాన్ని డిఎంకె తీర్మానం ఖండించింది. రుణాన్ని బ్యాంకు వ్యవహారాల ద్వారా ఓ ప్రైవేటు సంస్థ నుంచి పారదర్శకంగా స్వీకరించినట్లు తెలిపింది. 'కనిమొళి, టీవీ ఎండీ శరద్కుమార్లు విచారణకు వచ్చినప్పుడు సీబీఐ అరెస్టు చేయలేదు. వారు విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు వెళ్లినప్పుడు అరెస్టు చేసింది. బెయిలు ఇవ్వొద్దని కోరింది. ఇది ఆ సంస్థ ద్వంద్వ వైఖరికి నిదర్శనం" అని విమర్శించింది.