భూదాన్ పోచంపల్లి పొలం వివాదం వల్లే బాలరామకృష్ణ హత్య
బాలరామకృష్ణ ఇద్దరు సిపిఐ కార్యకర్తల హత్య కేసుల్లో నిందితుడు. దాంతో ల్యాండ్ మాఫియాతో సిపిఐ నాయకులు చేతులు కలిపినట్లు చెబుతున్నారు. బలరామకృష్ణ హైదరాబాదు సమీపంలోని భూదాన్ పోచంపల్లిలో 13 ఎకరాల భూమి కొని, తన అనుచరుడు హనుమాన్ చౌదరి పేరు మీద పెట్టాడు. అయితే, హనుమాన్ చౌదరి ఆ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నాడు. దీంతో చాలా కాలంగా హనుమాన్ చౌదరికి, బలరామకృష్ణకు మధ్య వివాదం చోటు చేసుకుంది. వివాదంపై పోలీసుల సమక్షంలో పంచాయతీ కూడా చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం హనుమాన్ చౌదరి బలరామకృష్ణకు కోట్లాది రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే, అతను బాలరామకృష్ణకు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో ఇరువురి మధ్య వివాదం తీవ్రమైంది.
భూ వివాదం కారణంగా హనుమాన్ చౌదరి బలరామకృష్ణను హత్య చేయించినట్లు అనుమానిస్తున్నారు. హనుమాన్ చౌదరి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు కృష్ణా జిల్లా అంతటా గాలిస్తున్నారు. రెండు రోజుల క్రితం హనుమాన్ చౌదరి కృష్ణా జిల్లాలో కనిపించాడని, అందువల్ల అతను జిల్లా దాటి వెళ్లి ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.